30 ఏళ్ల సమస్య, ఇదీ మేం చేసింది, పవన్ కళ్యాణ్ గ్రేట్!: బాబు, టూర్ వాయిదా
ఉద్ధానం కిడ్నీ సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పవన్, హార్వార్డ్ వైద్యుల బృందం తదితరులు సీఎంను కలిశారు.
విజయవాడ: ఉద్ధానం కిడ్నీ సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పవన్, హార్వార్డ్ వైద్యుల బృందం తదితరులు సీఎంను కలిశారు.
బాబుతో భేటీకి బయల్దేరిన పవన్ కళ్యాణ్: ఫ్లెక్సీ చించివేత, ఫ్యాన్స్ ఆగ్రహం
వెలగపూడి సచివాలయంలో భేటీ జరిగింది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరిగిపోవడానికి గల కారణాలను హార్వార్డ్ వైద్య బృందం చంద్రబాబుకు వెల్లడించింది. గత కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి రోగులతో మాట్లాడిన తర్వాత తాము తయారు చేసుకున్న ప్రాథమిక నివేదికను సీఎం ముందుంచారు.
ఈ ప్రాంతంలో ఎండ అధికమని, నీరు ఎక్కువగా తాగక పోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతోందని ఈ బృందం తేల్చింది. తాగునీటిలో సిలికా అధిక మోతాదులో ఉందని, వీరు నొప్పిని తట్టుకునేందుకు పెయిన్ కిల్లర్స్ అధిక మోతాదులో వాడటం వల్ల కూడా కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సాధారణ స్థాయితో పోల్చితే అధిక కలుషితాలను కలిగి ఉన్నాయని వెల్లడించింది.
ముప్పై ఏళ్లుగా.. పవన్ కళ్యాణ్కు మెచ్చుకోలు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ చూపిన చొరవకు అభినందనిస్తున్నట్లు తెలిపారు. ముప్పై ఏళ్లుగా కిడ్నీ సమస్య ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సమస్యను కనుగొనలేకపోయారన్నారు.
Recommended Video
రాజకీయ పరిణామాల పైనా
సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా వారికి చెప్పారు. హార్వార్డ్ యూనివర్సిటీ వైద్యుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. పవన్ - చంద్రబాబులు గంట పాటు చర్చించారు. ఉద్ధానం, పోలవరం, రాజధాని నిర్మాణం, మంజునాథ్ కమిషన్ తదితర అంసాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్కు చంద్రబాబు భరోసా
ఉద్దానం సమస్యను తగ్గించేందుకు తక్షణం మరిన్ని చర్యలు తీసుకుంటామని పవన్కు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇప్పటికే తాము తీసుకున్న చర్యలను వివరించారు. ఆపై వర్శిటీ ప్రొఫెసర్లు ఇచ్చిన ప్రజెంటేషన్ను విని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలన్నదే తమ అభిమతమన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరింత ఉపశమనాన్ని కల్పించాలన్న కృత నిశ్చయంతో ఉన్నామన్నారు.
మేం చేసినవి ఇవీ
ఇప్పటికే ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇక మరెవరికీ వ్యాధులు సోకకుండా చేసేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని అన్నారు. చిన్న వయసు నుంచే రక్షిత మంచినీటిని మాత్రమే తాగేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు సమస్యకు కారణాలను కొనుగొనలేక పోయారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధి చికిత్సకు 3 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో 14 ఏర్పాటు చేయనున్నామన్నారు. కిడ్నీ బాధితులు విశాఖ కెజిహెచ్ వెళ్లవలసిన అవసరం లేదని, ఎక్కడికి అక్కడే వైద్య నిర్ధారణ, చికిత్సలు ఉంటాయన్నారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు తాము చేసిన వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పవన్కు వివరించారు.
పవన్ కోసం బాబు పర్యటన వాయిదా
పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు తన తూర్పు గోదావరి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు.