మోడీతో పవన్ కళ్యాణ్ ఆరు సార్లు భేటీ: జనసేన విలీనమా, పొత్తా?
హైదరాబాద్: జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆరుసార్లు ప్రధాని మోడీని కలిశారని, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను మలుపు తిప్పే దిశగా ఈ భేటీలు నడిచాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బిజెపి పగ్గాలు పవన్ కళ్యాణ్ చేపట్టడం, అది కుదరకపోతే జనసేన పార్టీని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చి బిజెపికి బాసటగా నిలబడడం అనే విషయాలపై వారిరువురి మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే మోడీ మాత్రం జనసేనను బిజెపిలో విలీనం చేసి, పవన్ కళ్యాణ్ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెక్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి రావడానికి కావాల్సిన వ్యూహరచనను మోడీ పవన్ కళ్యాణ్తో కలిసి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇద్దరు ఎంపీలు, 5గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి బీజేపీ మిత్రపక్షంగా ఉంది. కేంద్రంలో టిడిపి మోడీ మంత్రివర్గంలో ఉంది. పలువురు సీనియర్ కాంగ్రెసు నేతలు చేరినప్పటికీ తెలుగుదేశం పార్టీని తలదన్నే రీతిలో బిజెపి బలోపేతం కావడం లేదు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కారణంగానే బిజెపి, టిడిపి కూటమి గెలిచిందనే వాస్తవాన్ని ఎవరూ కాదనడం లేదు.
25 ఎంపీ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో పార్టీని బలోపేతం చేయడంపై ఏకంగా ప్రధాని మోడీ ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివ రావు వంటి చెప్పుకోదగ్గ స్థాయి నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్పటికీ పార్టీ పరిస్థితిలో ఏమాత్రం బలం పుంజుకోలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికైనా ఏపీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్న మోడీ జనసేన అధినేత పవన్పై దృష్టి సారించారు.
తాను సొంతంగా స్థాపించిన పార్టీ ద్వారానే రాజకీయాలలో ప్రభావం చూపాలనే ఆకాంక్ష పవన్ కళ్యాణ్కు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో జనసేనను విలీనం చేస్తే దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని, ఆ పార్టీ నాయకత్వం కింద పని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.