జీర్ణించుకోలేకే: చిరు, పిఆర్పీలపై స్పందించనున్న పవన్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తన సోదరుడు, ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి నాడు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు.. ఆ తర్వాత వచ్చిన సాధారణ ఎన్నికల్లో పవన్ జోరుగా ప్రచారం చేశారు. అయితే, ఆ తర్వాత పిఆర్పీని కాంగ్రెసులో కలిపేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు.
ఈ కారణంగానే ఆయన జనసేన పార్టీని స్థాపిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీతో ప్రజలకు ఏదైనా చేయాలనుకున్న పవన్, అది కుదరక పోవడంతో.. ఇప్పుడు జనసేన పార్టీ ద్వారా చేద్దానుకుంటున్నారు. పవన్ ప్రధానంగా ఏడు లక్ష్యాలతో పార్టీని స్థాపిస్తున్నారని తెలుస్తోంది.

సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ జనసేన ఆవిర్భావ సభ నేడు హైదరాబాదు, మాదాపూర్లోని నోవాటెల్ హోటల్ లో జరుగనుంది. ఈ వేదికపై పవన్ ఒక్కరే వుంటారు. సభ నిర్వహణ, పార్టీ పేరు, జెండా రూపు రేఖలు, పార్టీ థీమ్ సాంగ్, పార్టీ ప్రకటన వేదిక ఇవన్నీ ఒకదాని వెనుక ఒకటి బయటకి వస్తున్నాయి.
తొలుత రాజకీయాలపై ఆయన రాసిన అభిప్రాయాల పుస్తకాన్ని విడుదల చేసి, ఆయన భావాలను స్వేచ్ఛగా అభిమానులు, ప్రజలతో పంచుకోనున్నారు. ఈ సభలో ఆయన ఒక్కరే 45 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు మాట్లాడనున్నారని సమాచారం. తన వ్యక్తిగత జీవిత విశేషాలు, తన స్వానుభవాలు, రాజకీయ అరంగేట్రానికి దారితీసిన పరిస్థితులు అన్నింటినీ ఆయనే స్వయంగా వెల్లడించనున్నారు. సభ రాత్రి 10 గంటలకల్లా ముగిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications