మా తొలి విజయం: చంద్రబాబు ప్రకటనపై పవన్, అచ్చెన్నాయుడికి చురక
ఉద్దానం బాధితుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటనను స్వాగతిస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
హైదరాబాద్: ఉద్దానం బాధితుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటనను స్వాగతిస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉద్దానం బాధితుల సమస్య తీవ్రతను చంద్రబాబు అర్థం చేసుకున్నారని శనివారం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

ఉద్దానం బాధితుల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టడం తమ తొలి విజయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉద్దానం బాధితుల సమస్యపై చంద్రబాబు స్పందించడం హర్షనీయమని అన్నారు. ఉద్దానం సమస్యపై స్పందించడం అన్ని రాజకీయ పార్టీల బాధ్యత అని స్పష్టం చేశారు.

మూడ్రోజుల క్రితం పవన్ కళ్యాణ్.. ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులను ఇచ్ఛాపురంలో కలిసిన విషయం తెలిసిందే. వారి బాధలను విన్న ఆయన.. ప్రభుత్వానికి 48గంటల డెడ్ లైన్ విధించారు. కాగా, ఈ లోగానే ప్రభుత్వం బాధితుల సమస్యపై స్పందించింది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు కంటే కూడా చంద్రబాబు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నారని పవన్.. మంత్రికి చురకంటించారు. సామాజిక కార్యకర్తలు, వైద్యులు ఈ సమస్య నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. కళింగ, ఆంధ్రా, ఉత్తరాంధ్ర సమస్యలపై తాము భవిష్యత్లో పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు.
చంద్రబాబు స్పందన ఇది
కాగా, శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో ఎక్కడ మేధావులు ఉన్నారో వెతికి పట్టుకుని ఉద్దానంలో కిడ్నీ వ్యాధికి మూలాలను కొనుగొంటామని తెలిపారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు వైద్యం కోసం విశాఖ, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉచితంగా బస్సుపాసులు ఇస్తామని ప్రకటించారు.
'ఉద్దానంలో కిడ్నీ వ్యాధి దేనివల్ల వస్తుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కొన్ని సంస్థలు నీటిలో సిలికాన్ వల్ల వస్తుందని అభిప్రాయపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం, హార్వర్డ్ వర్సిటీ పరిశోధనలు చేశాయి. మనకు పూర్తిగా నివేదిక ఇవ్వలేకపోయాయి. వ్యాధి తీవ్రత ఉన్న అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇవ్వనున్నాం. ఎన్టీఆర్ సుజలస్రవంతి తాగునీటి పథకం కింద రూ.2కు 20లీటర్ల నీటిని అందిస్తాం’ అని తెలిపారు.
ఆన్లైన్లో పర్యవేక్షించి నాణ్యమైన జలాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సోంపేట, పలాసల్లో మరో రెండు డయాలసిస్ యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బాధిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా సంచార వైద్య సౌకర్యం కల్పిస్తామని, కిడ్నీ రోగులకు నెలకు రూ.1,500 వరకు పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications