మూడో రోజు దుర్గగుడిలో ప్రాయశ్చిత్తం ఇలా
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష.. నేడు మూడో రోజుకు చేరింది. ఈ దీక్షలో భాగంగా ఈ ఉదయం ఆయన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఆలయం మెట్లను నీటితో కడిగి శుభ్రం చేశారు.
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకున్నారు. ఇటీవలే గుంటూరు జిల్లా నంబూరులో గల దశావతార శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీక్షను ధరించారు. 11 రోజుల పాటు సాగే దీక్ష ఇది. ఒక్కో రోజు ఒక్కో ఆలయంలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించారు.
మూడు రోజున బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించారు పవన్ కల్యాణ్. ఈ ఉదయమే ఆలయానికి వచ్చారు. ఆయనకు సంప్రదాయబద్ధంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం చీపురుతో ఆలయం మెట్లను ఊడ్చారు. నీళ్లతో కడిగారు. ఆ సమయంలో ఆయన వెంట పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ- గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటోన్నానని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆలయాల్లో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు.
VIDEO | Andhra Pradesh Deputy CM Pawan Kalyan (@PawanKalyan) performs a purification ritual at Sri Durga Malleswara Swamy Varla Devasthanam in Vijayawada. He has begun his 11-day ‘Praschit Deeksha’ (penance) amid controversy over the alleged adulteration of animal fat in the… pic.twitter.com/wKgaMa3GDP
— Press Trust of India (@PTI_News) September 24, 2024
కాగా- అక్టోబర్ 2వ తేదీన తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు పవన్ కల్యాణ్. దీనికోసం ఒకరోజు ముందే తిరుమలకు చేరుకుంటారు. 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకుని దీక్షను విరమిస్తారు. ఆ రోజు తిరుమలలోనే బస చేస్తారు.
ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహించే అవకాశం ఉంది. వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. తిరుమల లడ్డూ, వంద రోజుల పరిపాలన, సూపర్ 6 హామీల అమలు.. వంటి అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications