సాయంత్రం 4.30 గంటలకు పవన్ ప్రెస్ మీట్: ఉత్కంఠ, ఏం మాట్లాడతారు?
హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడనున్నారు.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదంటూ పలువురు రాజకీయ నేతలు పవన్ కళ్యాణ్ను నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే తాను మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడతానని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో చెప్పిన సంగతి తెలిసిందే.
I will express my views on Cash-for- Vote case, Phone- tapping and on Section 8 in the next two days.
— Pawan Kalyan (@PawanKalyan) June 29, 2015 పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారనేది అందరికీ ఆసక్తికరమైన విషయమే. సహజంగానే ఉద్వేగపూరిత ప్రసంగం చేసే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఆయన అభిమానులు కూడా ఆయన ఏం మాట్లాడతారా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

నోటుకు ఓటు కేసు నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై రెండు సార్లు కూడా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన నోటుకు ఓటు కేసును ప్రస్తావించకపోవచ్చునని అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇరు రాష్ట్రాల నాయకులను తప్పు పడుతూ మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. నోటుకు ఓటు కేసు తర్వాత సంభవిస్తున్న పరిణామాలను ప్రధానంగా తీసుకుని, ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి రాజకీయాలు పనిచేస్తున్నాయని మాత్రమే ఆయన అనవచ్చునని ఊహిస్తున్నారు.
ముఖ్యంగా ఓటుకు నోటు పైన పవన్ కళ్యాణ్ మాట్లాడనందుకు ఆయన ఇంటికి వెళ్లి నిలదీస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావు పేర్కొన్నారు. తాను ఆయన ఇంటికి వెళ్తానని, ఆయన ఇంట్లోకి రానిస్తే అక్కడ చర్చిస్తానని లేదంటే ఇంటిముందు ఆందోళన చేస్తానని హెచ్చరించారు కూడా. ఎన్నికలకు ముందు చెప్పిన మాటల పైన ఆయన స్పందించాల్సి ఉందన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications