ఇచ్ఛాపురంకు పవన్: కిడ్నీ బాధితుల వ్యథలపై జనసేన డాక్యుమెంటరీ ఇదే
శ్రీకాకుళం: జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో ప్రజలను పట్టిపీడిస్తున్న కిడ్నీ(మూత్రపిండాల) వ్యాధిపై అధ్యయనం చేయడంతో పాటు వ్యాధిగ్రస్తులతో మంగళవారం ముఖాముఖి నిర్వహించేందుకు ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో ఇచ్చాపురం చేరుకోనున్నారు. బాధితుల సమస్యలను పవన్ ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు.
ముఖాముఖి
పవన్తో ముఖాముఖిలో పాల్గొనేందుకు సుమారు 500ల మంది వ్యాధిగ్రస్తులను ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్కు తరలివచ్చారు. పవన్కు తమ బాధలను చెప్పుకుంటామని వ్యాధి బాధితులు తెలిపారు.
గంటపాటు సమావేశం
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాల నుంచి వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వ్యాధిగ్రస్తులతో సుమారు గంటన్నర పాటు పవన్ ముఖాముఖి నిర్వహిస్తారు.
రోడ్ షో
అనంతరం ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రోడ్ షో కూడా నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ నేతలు తెలిపారు. కాగా, పవన్ను చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు ఇచ్ఛాపురం చేరుకున్నారు.
జనసేన డాక్యుమెంట్
12మండలాల్లో కిడ్నీ వ్యాధి ప్రబలుతున్నట్లు సమాచారం. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే సుమారు 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ సుమారు లక్ష మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వాలు తమను పట్టించుకోకపోవడం వల్లే సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని బాధితులు అంటున్నారు. కాగా, జనసేన పార్టీ కిడ్నీ వ్యాధి బాధితల గురించి ముందే అధ్యయనం చేసింది. వారిపై ఓ డాక్యుమెంట్ ను కూడా రూపొందించింది.