పవన్ కళ్యాణ్ కు వైసీపీ మంత్రి కన్నబాబు చురకలు .. తిరుపతిలో వివేకా హత్య కేసుపై పవన్ వ్యాఖ్యల దుమారం
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని, ఇంటెలిజెన్స్ చీఫ్ కు , సీఎం రమేష్ కు మధ్య జరిగిన సంభాషణలు పవన్ కళ్యాణ్ కు తెలియదా అని ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్ పోరాటం అంటే కత్తి తీసుకెళ్ళి యుద్ధం చెయ్యాలా? ఆ త్రయంపై వైసీపీ మంత్రి ధ్వజం
వివేకా హత్య కేసుపై టీడీపీ ప్రభుత్వాన్ని నాడు పవన్ ప్రశ్నించలేదన్న మంత్రి
సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు హత్య కేసులో ఆధారాలు తుడిచి పెట్టారని, అప్పుడు టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వివేకా హత్య పై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తిన మంత్రి కన్నబాబు వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించింది జగన్ అని వెల్లడించారు. ప్రస్తుతం వివేకా హత్య కేసు పై సిబిఐ విచారణ జరుగుతోందని, సీబీఐకి అప్పగించిన తర్వాత ఏ కేసు తోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదని మంత్రి కన్నబాబు వెల్లడించారు.
పవన్ ప్రశ్నించాల్సింది మిత్రపక్షమైన కేంద్రంలోని బీజేపీనే
పవన్ కళ్యాణ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై ప్రశ్నించాల్సినది మిత్రపక్షమైన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అని మంత్రి కన్నబాబు చురకలంటించారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగితే పవన్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని మంత్రి కన్నబాబు నిలదీశారు. కేవలం రాజకీయ లబ్ది కోసం వివేకా హత్యపై మాట్లాడుతున్నారని అన్నారు . ఏ చిన్న అవకాశం దొరికినా విమర్శలు చెయ్యటం పరిపాటిగా మారిందని అసహనం వ్యక్తం చేశారు .
తిరుపతి సభలో మోడీ ప్రత్యేక హోదాపై మాటిచ్చారు.. ఇప్పుడు దానిపై మాట్లాడరేం
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన మంత్రి కన్నబాబు తిరుపతి సభలో మోడీ ప్రత్యేక హోదా పై మాట ఇచ్చిన సంగతి పవన్ కు గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు. పవన్ తమను ప్రశ్నించడం మానేసి బీజేపీని ప్రశ్నించాలని, ప్రత్యేక హోదా పై, స్టీల్ ప్లాంట్ పై బీజేపీని పవన్ నిలదీయాలని అన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమైందని చెప్పారు మంత్రి కన్నబాబు .
విభజన హామీలపై నోరు మెదపరేం ..
విభజన హామీలపై పవన్ బీజేపీని ఎందుకు ప్రశ్నించటం లేదని అడిగారు . నాడు పాచిపోయిన లడ్లు అంటూ వ్యాఖ్యలు చేసింది ఎవరు అంటూ ప్రశ్నించారు . తిరుపతిలో టిడిపి, బిజెపి రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి తెలుగుదేశం పార్టీ కి భయం పట్టుకుంది అన్నారు. అందుకే చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ పేరుతో పోటీ చేయకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు.