ఏపీ సర్కారు దమననీతి: రఘురామ కృష్ణంరాజు అరెస్టుపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్పందన
అమరావతి: అధికార వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా శృంఖలంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించాల్సి ఉండగా... ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం ఏమాత్రం సమర్ధింపు చర్య కాదని అన్నారు.
Recommended Video

రఘురామ కృష్ణంరాజు అరెస్టు అప్రజాస్వామికమన్న పవన్
ప్రభుత్వాన్ని తరుచూ తీవ్రంగా విమర్శిస్తున్నారనే కారణంతో ఎంపీని సమయం, సందర్భం లేకుండా అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఒక పక్క కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, రెమిడిసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లకు తరలిపోతుండగా అవసరమైన మందుల కోసం పది షాపులు తిరగవలసిన క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల బాధలపై దృష్టిపెట్టాలి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

పక్క రాష్ట్రం అంబులెన్స్లు ఆపేసినా..
ఒక పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యం కోసం వెళుతున్న అంబులెన్స్ లను పక్క రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. చివరికి తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ అంబులెన్స్లు కదిలే పరిస్థితి రాలేదు. రాష్ట్రంలో కోవిడ్ను ఏదో అద్భుతాలు సృష్టించి ఆపమని జనసేన కోరడం లేదు. వైద్యపరంగా అక్కడున్న వనరులు, వైద్య సిబ్బంది, ఇతరత్ర అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతోందన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యర్ధి పార్టీ నేతలతోపాటు సొంత పార్టీ ఎంపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారన్నారు.

కరోనా మహమ్మారితో ప్రజలు అల్లాడిపోతుంటే..
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇలాంటి విపత్కర సమయంలో సొంత పార్టీ ఎంపీనీ అరెస్టు చేయడంపై చూపించిన శ్రద్ధ ఏ విధంగా హేతుబద్ధమో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. ఊరూరా కొల్లలుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంభయంగా గడుపుతున్నారు. ప్రజల్లో మనో ధైర్యాన్ని నింపి, ఆక్సిజన్, మందులు, ఆస్పత్రుల్లో బెడ్లు అందేలా ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

ఏపీ సర్కారు దమననీతిని కట్టిపెట్టాలన్నా వపన్ కళ్యాణ్
కొంత కాలంపాటైనా రాజకీయ దమననీతిని కట్టిపెట్టాలని డిమాండ్ చేస్తోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాగా, ఎంపీగా రఘురామకు ఉండే హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాసినట్లు తెలుస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో ఎంపీ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వ తీరును లోక్సభ స్పీకర్ సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించాలన్నారు. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యల అభియోగాలతో ఎంపీ రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరునుపై మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications