ఇది సినిమా కాదు, వారిపై ఆధారపడను, ఇప్పుడే పార్టీ నుంచి వెళ్లిపోండి: పవన్ కళ్యాణ్
చిత్తూరు: అనుకోగానే అయిపోవడానికి రాజకీయాలు.. సినిమా కాదని, రాజకీయం ఓ సామాజిక బాధ్యత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆదివారం చిత్తూరు జిల్లా జనసైనికుల సమావేశంలో మాట్లాడారు. అందరి ఆశయాలను నేను బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. కొన్ని కుటుంబాల చేతిలో రాజకీయం ఉందని, అందుకే సమస్యలు అన్నారు. జనసేనతో సామాన్యుడే నాయకుడు అన్నారు.
తాను పార్టీ పెట్టే సమయంలో ఒక్కడినే ఉన్నానని, ఈ వ్యవస్థ మారాలని, అన్యాయం, రౌడీయిజం అనేది సమాజంలో కడిగేయాలని వచ్చానని చెప్పారు. అందరూ రాజకీయాల్లోకి రావాలి తప్ప కొన్ని కుటుంబాలు మాత్రమే కాదని, రౌడీలూ, గూండాలూ కాదన్నారు. పనిచేసేవారు, నిబద్ధత ఉన్నవారు, ప్రజా సమస్యలపై పోరాడేవారు రావాలి రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
నేను రెండు జిల్లాలకే పరిమితం అంటున్నారు కానీ
తాను కేవలం రెండు జిల్లాలకు చెందినవాడినని కొందరు అంటున్నారని, కానీ నేను రాయలసీమకు వస్తే ఎలా ఉందో చూశారుగా అని సమావేశానికి వచ్చిన వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. రౌడీ రాజకీయం మారి పోవాలన్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీలు ఏనాడైనా జాతీయ జెండాను పట్టుకున్నాయా అని ప్రశ్నించారు. కేవలం వాళ్ల జెండాలు మాత్రమే పట్టుకుంటారన్నారు. భారత దేశ జెండాతో ఎప్పుడూ జనసేన పిడికిలి బిగించి ఉంటుందని చెప్పారు. ఓ నిర్ణయం తీసుకుంటే కంఠం తెగిపడుతున్నా మాట తప్పకూడదన్నారు.
అందుకే సినిమాలను వదిలేశా
సీమకు వైయస్, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడి పరిస్థితులు మెరుగుపడలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు రాజకీయం వ్యాపారం కాదని, మాటలు చెప్పనని, చేసి చూపిస్తానని అన్నారు. డాక్టర్ అవ్వాలంటే కొన్నేళ్లు చదువుతారని, నేను సోషల్ డాక్టర్ కావడానికి పలు సమస్యలు చూశానని చెప్పారు. తన సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హిట్ అయినా సరే ఈ సమాజం మారదు కదా... అందుకే తనకు ఉండీ, ఉండీ సినిమాలు మీద ఆసక్తి పోయిందని, తన దృష్టి అంతా సమాజం పైన ఉండేదని, అందుకే సినిమాలు వదిలేశానని చెప్పారు.
వారిపై ఆధారపడి రాజకీయాలు చేయను
డబ్బు వద్దు అని రాజకీయ నాయకులు అనుకుని ఉండి ఉంటే మన సమాజం చాలా బాగుపడేదని, వాళ్ళు డబ్బు గురించే రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొద్దామన్నారు. రాజకీయ పార్టీ నడపాలంటే అనుభవం కావాలని, తాను ఎవరి పైనో ఆధారపడి జనసేనను స్థాపించలేదని చెప్పారు. ఓ వైపు సినిమాలు చేస్తూ రాజకీయాలకు ప్రిపేర్ అయ్యానని, ఏదో ఒకరోజు తాను రాజకీయాల్లోకి వస్తానని తనకు ముందే తెలుసునని చెప్పారు. సీనియర్ జర్నలిస్టులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ల మీద ఆధారపడి మాత్రం రాజకీయాలు చేయనని చెప్పారు.
ఇప్పుడే పార్టీ నుంచి వెళ్లిపోండి
2019 ఎన్నికల కోసమే వచ్చామని మన పార్టీలోని వారు ఎవరైనా భావిస్తే ఇప్పుడే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చునని పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పారు. రాజకీయం సుదీర్ఘ ప్రస్థానం అన్నారు. కనీసం పదేళ్లు కూడా కలిసి ప్రయాణించే ఓపిక లేకుంటే ఏం సాధిస్తామని, అనుకోగానే అయిపోవడానికి ఇది సినిమా కాదన్నారు. నేను చాలా బాధ్యతగా ఉన్నాని చెప్పారు. ప్రతి జనసైనికుడు గ్రామగ్రామానికి వెళ్లి జనసేన సిద్ధాంతాలు ప్రచారం చేయాలని సూచించారు.