పవన్ సంచలనం - బొత్సా పరిస్థితి దయనీయం : సజ్జలే అన్నీ శాఖలకు - ఎంపీ అంటే రఘురామే...!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల విధానం ఒక మిథ్య అంటూ వ్యాఖ్యానించారు. గంజాయి మొక్కను రాష్ట్ర చిహ్నంగా వైకాపా ప్రభుత్వం మార్చేసిందన్నారు. ఏకంగా గంజాయి కలిపిన సారాను అమ్ముతున్నారంటూ పవన్ కామెంట్ చేసారు. ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై అనుమానాలున్నాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్నారన్నారు.

ఈ ఎన్ని రోజులు జైళ్లో పెట్టాలి
ఎక్కడ చూసినా ఈ నాయకులకు భూమి పిచ్చే కనిపిస్తోంది. ముంబాయి నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ నౌకలో తక్కువ మోతాదులో ఓ వ్యక్తి నుంచి మత్తు పదార్థాలు లభ్యమైతే కొన్ని ఆధారాలతో అనుమానించి షారుక్ఖాన్ కుమారుణ్ని కొద్ది రోజులు జైల్లో పెట్టారని చెప్పుకొచ్చారు. అటువంటిది ఒక పంట కాలంలో దాదాపు నాలుగు వేల టన్నుల గంజాయి బయటకు వెళ్తుంటే ఎంతమంది నాయకులను, ఎన్ని రోజులు జైల్లో పెట్టాలంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

మద్యం తాగిస్తున్నారు
జన సైనికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా.. 2024 నుంచి వచ్చే అయిదు సార్వత్రిక ఎన్నికల్లో తమతో పోరాడడానికి సిద్ధమైతేనే బెదిరించండని హెచ్చరించారు. చంటి పిల్లలకు పాలు తాగించినట్లు రాష్ట్రంలో మద్యం తాగిస్తున్నారని పవన్ ఆరోపించారు. ప్రతి విద్యార్థికి మేనమామగా ఉంటానని ఎన్నికల్లో చెప్పారని... ఇప్పుడు ఆ పిల్లలు చదువుతున్న ఎయిడెడ్ పాఠశాలలను అమ్మేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అటువంటి వ్యక్తి మళ్లీ అధికారంలోకి వస్తే మీ ఇళ్లు కూడా తీసుకుంటారని పవన్ వ్యాఖ్యానించారు.

ఎంపీ అంటే రఘురామరాజు - సజ్జల మినహా మరెవరూ
మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన ప్రభుత్వం బూమ్బూమ్ బీరు తాగుతావా.. ప్రెసిడెంట్ మెడల్ తాగుతావా అంటూ అమ్మకాలు సాగిస్తోందని ఎద్దేవా చేసారు. ఇక, రాజకీయంగానూ వైసీపీ ప్రభుత్వం గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు రాష్ట్రంలోని మంత్రులు..ఎంపీల పేర్లు ఎవరూ గుర్తుండవని చెప్పారు. ఎంపీల గురించి అడిగితే రఘురామ రాజు తప్ప మరెవరూ తెలియరంటూ వ్యాఖ్యానించారు. ఏ శాఖ గురించి స్పందించాలనుకున్న..ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడతారని పవన్ ఆక్షేపించారు.
Recommended Video

బొత్సా పరిస్థితి దయనీయమంటూ
బలమైన సామాజికవర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ పరిస్థితి ఇప్పుడు వైసీపీ చాలా దయనీయంగా ఉందని చెప్పుకొచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోల్పోయిన వ్యక్తిగా బొత్సా గురించి పవన్ వివరించారు. కనీసం హోంమంత్రి, పరిశ్రమలు, ఆర్థికశాఖైనా ఇవ్వలేదని..పురపాలకశాఖ చూస్తున్నా సహాయ మంత్రిలా కొనసాగుతున్నారు. ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యల పైన బొత్సా ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. గతంలోనూ బొత్సా గురించి పవన్ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసారు. బొత్సా సైతం పవన్ పైన రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు బొత్సా పైన విమర్శలు కాకుండా.. ఆయన దయనీయ పరిస్థితిలో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications