సీఎం జగన్ వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ - మంత్రులే రెచ్చగొట్టారు : నరసింహ దర్శన యాత్రకు నిర్ణయం..!!
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ డిమాండ్లు..సమ్మె పిలుపు ..ప్రభుత్వంతో చర్చల పైన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా సమ్మె ఎవరు కోరుకుంటున్నారంటూ...చంద్రబాబు దత్త పుత్రుడు అని పవన్ ను పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీని పైన స్పందించిన పవన్.. తాను దత్తపుత్రుడిని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు తన దృష్టికి వచ్చాయని తాను ప్రజల దత్తపుత్రుడిని అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తామేదో వారిని రెచ్చగొడుతున్నట్టు వచ్చిన వార్తలపై పవన్ మండిపడ్డారు.

ప్రభుత్వానికి అందరూ శత్రువులుగానే
మంత్రులే ఉద్యోగులను రెచ్చగొట్టారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి అందరూ శత్రువులుగా కనిపిస్తారంటూ దుయ్యబట్టారు. పీఆర్సీ అంశం ఉద్యోగులు ఎవరికీ సంతృప్తి ఇవ్వలేదన్నారు పవన్. అదే విషయాన్ని తాము పేర్కొన్నామన్నారు. ప్రభుత్వంపై ఎవరైనా సహేతుక విమర్శలు చేస్తే దాన్ని స్వీకరించకుండా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మీకు నచ్చని సలహాలిస్తే న్యాయవ్యవస్థలోని న్యాయమూర్తులపై కూడా వైసీపీ నేతలు విమర్శలు చేశారంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. పీఆర్సీ, ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అంశం తాము సృష్టించింది కాదన్నారు.

కడుపు మండి రోడ్ల మీదకు
ఆధిపత్య ధోరణి అనే పదం ప్రభుత్వ సలహాదారు సజ్జల గారికి నచ్చినట్టు లేదంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను, డిమాండ్లన సానుకూలంగా పరిశీలించి వుండాల్సిందన్నారు. లక్షలాదిమంది ఉద్యోగులు కడుపుమండి రోడ్ల మీదకు వస్తే దానికి కారణం మేం కాదని స్పష్టం చేసారు. ఎన్నికలకు ముందు వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని, ఉద్యోగాలు ఇస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చారని పవన్ గుర్తు చేశారు.
రాష్ట్రప్రభుత్వం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే ఎవరు మాట్లాడతారని, సమస్యలపై పోరాడుతున్న వారిని వెక్కిరించడం మంచి పద్ధతి కాదని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాలని.. ఇష్టానుసారంగా మాట్లాడటం వల్లే ఆధిపత్య ధోరణి అని తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు.
Recommended Video

పవన్ నరసింహ దర్శన యాత్ర
కడుపు మంటతో ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా నివాల్సిన బాధ్యత పార్టీలపై ఉందని చెప్పారు. ఇదే సమయంలో పవన్ కీలక ప్రకటన చేసారు. తాను రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల శ్రేయస్సును కోరుతూ నరసింహ దర్శన యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. తమ ఇంటి దైవం ఆంజనేయ స్వామిని కొలుస్తూ కార్యక్రమం చేపడతున్నట్లు తెలిపారు.
కొండగట్టు ఆంజనేయ స్వామిని..ధర్మపురి నరసింహ స్వామిని దర్శిస్తానని వివరించారు. అదే విధంగా మార్చి 14 ఆవిర్భావ దినోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ నేతలు పరిమిత సంఖ్యలో హాజరై కార్యక్రమాల్లో పాల్గొనాలని పవన్ సూచించారు.












Click it and Unblock the Notifications