దూసుకొస్తున్న పవన్ కళ్యాణ్.. జగన్ తోడు: రివర్స్... టిడిపి ఏం చేస్తుంది?
2019 సార్వత్రిక ఎన్నికలకు ఏపీలో ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలను గమిస్తున్న వారు భావిస్తున్నది..
విజయవాడ: 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏపీలో ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలను గమిస్తున్న వారు భావిస్తున్నది.. కాంగ్రెస్ - లెఫ్ట్ - జనసేన ఓ వైపు, వైసిపి ఇంకోవైపు ఉంటాయని అంటున్నారు. ఏటూ టిడిపి - బిజెపి మధ్య ఏమవుతుందనేది ఇంకా తేలడం లేదని అంటున్నారు.

స్నేహం అంటూ ఒంటరి పోరుకు....
టిడిపి - బిజెపిలు పరస్పరం తమ అవసరాల్ని గుర్తిస్తూ స్నేహం మంచిదని చెబుతూనే.. మరోవైపు ఒంటరి పోరు బెట్టర్ అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు.

టిడిపితో కలిసి ఉండాల్సిన పరిస్థితి
కానీ ఏపీ బీజేపీ నేతలు ఊహించిన దానికి అంతా రివర్స్ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. దీంతో ప్రజల్లో బీజేపీ పలచన అయింది. దీంతో ఇప్పుడు వారు టిడిపితో జత కట్టకుండా ఉండలేని పరిస్థితి ఎదురయింది.

ధీటుగా ఎదగాలని..
ఏపీకి హోదా పైన తేల్చి చెప్పక ముందు ఏపీ బీజేపీ నేతలు 2019లో ఒంటరి పోరు బాగుంటుందనుకున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి, ఒంటరిగా పోటీ చేస్తే టిడిపి - వైసిపిలకు ధీటుగా ఎదుగుతామని, 2024 వరకు అధికారమే లక్ష్యంగా పని చేయాలని భావించాయి.

టిడిపి పరిస్థితి ఇదీ..
టిడిపి పరిస్థితి కూడా అలాగే ఉంది. విభజన నేపథ్యంలో ఏపీలో ఆర్థిక కష్టాలు ఉన్నాయి. కేంద్రం సహకారం అవసరం. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు, టిడిపి నేతలు కూడా అంగీకరిస్తున్నారు. 2019లో తిరిగి అధికారంలోకి రావాలన్నా, ఏపీ అవసరం కోసమైనా.. కేంద్రంతో సఖ్యతతో మెలగాల్సిన పరిస్థితి టిడిపిది.

సస్పెన్స్... అక్కడే టిడిపికి చిక్కు
కానీ, ఏపీకి హోదా ఇస్తామన్న కేంద్రం నాలిక మడతేసింది. దీనిపై బీజేపీ ప్యాకేజీ పేరుతో సర్ది చెప్పుకుంటోంది. టిడిపి కూడా ప్రస్తుతం అదే మాట చెబుతోంది. అయితే 2019లో ప్రత్యేక హోదా అంశమే ప్రచారాస్త్రంగా మారే అవకాశముంది. ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. కాబట్టి అది నష్టపోయేది ఏమీ ఉండదు. అధికారంలో ఉన్న టిడిపి 2019లో తిరిగి గట్టెక్కాలంటే.. బీజేపీతో కలిసే ఉంటుందా.. లేక ప్రతిపక్షాలు హోదాతో ఎదురు దాడి చేస్తుంటే.. కమలాన్ని వదులుకుంటుందా అనేది ఎన్నికలకు ముందు తేలే అంశమని అంటున్నారు. ఇక్కడే టిడిపికి చిక్కు వచ్చిందంటున్నారు.

దూసుకొస్తున్న పవన్.. వ్యూహాత్మక అడుగులు
ఓ వైపు ప్రతిపక్ష నేత జగన్ పలు సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని పదేపదే నిలదీస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకొస్తున్నారు. తొలుత సమస్యల పైన నిలదీశారు. ఆ తర్వాత బహిరంగ సమావేశాలు పెట్టారు. అనంతరం తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆ దిశలో పావులుకదుపుతున్నారు.

పవన్ కదలికలు చూస్తుంటే..
2014లో బిజెపి - టిడిపికి మద్దతిచ్చిన పవన్.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. వారికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేశారు. లెఫ్ట్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. పవన్ కదలికలను చూస్తుంటే.. లెఫ్ట్ - కాంగ్రెస్ - జనసేన జతకట్టే అవకాశాలను కొట్టి పారేయలేని పరిస్థితి అంటున్నారు.

జగన్-పవన్లకు తోడు.. టిడిపి ఏం చేస్తుంది?
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు చేసి.. ఆ తర్వాత పూర్తిగా కార్యరంగంలోకి దిగనున్నారు పవన్ కళ్యాణ్. స్వయంగా హామీలు ఇవ్వడమే కాకుండా.. ప్రజల నుంచి వచ్చే సూచనల ఆధారంగా మేనిఫెస్టో తయారు చేస్తానని పవన్ చెప్పడం గమనార్హం.
2019కి ప్రతిపక్ష వైసిపి, దూసుకొస్తున్న జనసేనలు ప్రత్యేక హోదానే ప్రధాన అంశంగా చేసుకుంటాయంటున్నారు. జగన్ - పవన్లకు లెఫ్ట్, కాంగ్రెస్లు కూడా తోడవుతాయి. ప్రత్యేక హోదానే ప్రధాన అంశం కాబట్టి టిడిపి - బిజెపిల ఫ్రెండ్ షిప్ ఏమవుతుందనే చర్చ అప్పుడే జరుగుతోంది.












Click it and Unblock the Notifications