టీడీపీకి గండికొట్టగలను.. చేతకాని వాజెమ్మ అనుకున్నారా?, గుండుపై మళ్లీ, రేవంత్ ప్రస్తావన: పవన్
ఒంగోలు: మూడో రోజు పర్యటనలో భాగంగా ఒంగోలులో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పెట్టడం వెనుక ఉద్దేశాలను, తన ఆశయాలను కార్యకర్తలకు పవన్ వివరించారు.
Recommended Video
వేలకోట్లు లేకుండా, వెనకాల మేదావులు లేకుండా ఒక కలతో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు. ఆశయాలు కేవలం పేపర్లకే పరిమితం అనుకునే ప్రస్తుత ప్రపంచంలో వాటిని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే జనసేన పెట్టానని స్పష్టం చేశారు.
నెల్లూరులో.. అప్పుడే ఫిక్స్ అయ్యా
కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్న సందర్భంగా.. జల్సా సినిమాలో డైలాగ్ను గుర్తుచేశారు పవన్ కళ్యాణ్. 'ఒకరికి వస్తే కోపం.. పదిమందికి వస్తే ఉద్యమం' అని ఆ డైలాగ్ ప్రస్తావించారు. రాజకీయాలు ఎలా పడితే అలా నడుస్తున్న తరుణంలో.. భావితరాలకు మంచి చేయాలన్న స్పృహతోనే జనసేన ఆవిర్భవించిందన్నారు. నెల్లూరులో పదో తరగతి చదువుతున్న సమయంలోనే తాను రాజకీయాల్లోకి రావాలని బలంగా ఫిక్స్ అయ్యానని, ఇప్పుడు కాదని స్పష్టం చేశారు.
ఒక్కడితోనే మార్పు:
'భయాలు ఉంటాయి.. ఒత్తిళ్లు ఉంటాయి.. మూడున్నర సంవత్సరాలుగా నువ్వు పార్టీని ఏం నడిపించావ్?.. పాలక వర్గాల మద్దతు లేదు, పెద్ద మనుషులు లేరు.. లింగు లిటుకుమంటూ ఏం చేస్తావన్నారు. కానీ ఒక్కడితోనే ప్రపంచం కదులుతుంది మార్పు వస్తుంది..' అన్నారు పవన్. ప్రపంచంలో మార్పు వచ్చిన సందర్భాలన్ని ముందుగా ఒక్కడు కదలితేనే వచ్చాయని గుర్తుచేశారు.
స్వామి వివేకానంద స్పూర్తి
తాను చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద స్పూర్తిగా పెరిగానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన పలుకులను జీర్ణించుకున్న వ్యక్తి అని తెలిపారు. తానెప్పుడూ చదువులు, కోట్లు కోరుకోలేదని, స్వామి వివేకానంద చెప్పినట్లుగా తాను బతకాలనుకున్నానని అన్నారు.
అందుకే వచ్చాను:
పొలిటికల్ వ్యవస్థకు అకౌంటెబిలిటీ ఎలా పట్టుకురావాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
ఛలోరే ఛలో స్టార్ట్ చేసినప్పుడు మూడు పదాలు చెప్పానని గుర్తుచేశారు. అకౌంటెబిలిటీ, పారదర్శకత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేవి రాజకీయాలకు కీలకమని, వాటి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
కోట్ల మందికి ప్రామిస్ చేశాను..
పవన్ కళ్యాణ్ ప్రసంగం సందర్భంగా అభిమానులు అరుపులు, కేకలతో విరుచుకుపడటంతో.. మీనుంచి అరుపులు కేకలు కోరుకోవడం లేదన్నారు పవన్.
హోదా గురించి ప్రస్తావిస్తూ.. 'హోదాపై ఎందుకు పోరాటం చేయలేదని నన్ను ప్రశ్నిస్తున్నారు?.. కానీ నేనొక్కడినేనా పోరాటం చేయాల్సింది అనుకున్నపుడు ప్రజలు సిద్దంగా ఉన్నారా?.. అని ఆలోచించానన్నారు.
'తెలంగాణ ప్రజలంతా కోరుకుంటే.. 'మా తెలంగాణ' అనుకుంటే వాళ్లకు రాష్ట్రం వచ్చింది. కానీ హోదా ఉద్యమానికి మీరు సిద్దంగా ఉన్నారా? ప్రభుత్వాలు సిద్దంగా ఉన్నాయా?.. తెలుగుదేశం, వైసీపీ సిద్దంగా ఉన్నారా?..' అని ప్రశ్నించారు.
'కేంద్ర ప్రభుత్వం వద్దకు ఉద్యమాన్ని తీసుకెళ్లడం చాలా కష్టమైన పని. అయినా సరే, మా గోడును పట్టించుకోని ప్రధానమంత్రి అని చెప్పడానికి నేను భయపడను. ఇది వ్యక్తిగత కోరిక కాదు. కోట్ల మందికి ప్రామిస్ చేశాను.' అని చెప్పుకొచ్చారు.
రేవంత్ ప్రస్తావన.. బాసర విద్యార్థులపై?
'బాసరలో ఐఐఐటీలో చదువుకుంటున్న ఆంధ్రా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ జరగడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రులకు అదెందుకు పట్టడం లేదు. విద్యార్థులు రోడ్ల మీద ఉండాలా? ఇక్కడి మంత్రులు అక్కడివాళ్ల పెళ్లిళ్లకు, శభకార్యాలకు వెళ్తారు.. తెలంగాణలో కాంట్రాక్టులు తెచ్చుకుంటారు.. ఇవి నేను చెప్పినవి కాదు.. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు.' అంటూ పవన్ ఫైర్ అయ్యారు.
చేతకాని వాజెమ్మను కాను
'కులాల ఐక్యత ఎలా సాధించాలో తెలియదు కానీ సామరస్యం అనేది ముఖ్యం. పరిటాల రవి అనే వ్యక్తి తమ్ముడు సినిమా షూటింగ్ సమయంలో గుండు కొట్టించారని ఒక ప్రచారం తిప్పారు. అది మూడు సంవత్సరాలు పెరిగి పెద్దదై.. ఓరోజు ఏకంగా పేపర్ బ్యానర్ ఐటెంగా వచ్చింది. అప్పుడొచ్చాను రోడ్డు పైకి. నేనెప్పుడూ దేశ సంక్షేమం గురించి ఆలోచిస్తాను. పోన్లే అనుకున్నాను.. కానీ నేనేమైనా చేతకాని వాజెమ్మ అనుకున్నారా?.. ఉప్పు కారం తింటున్నవాడిని.. చాలా పౌరుషం ఉంది నాకు. నా నిగ్రహం చేతకాని తనం కాదు. సంయమనం.' అని ఆవేశంగా మాట్లాడారు.
కులాల సామరస్యత అవసరం
'వంగవీటి ఎందుకు మాట్లాడానంటే.. కులాల మధ్య సామరస్యత లేకపోతే రాష్ట్రం బాగుపడదు. తెలంగాణలో కులాల గొడవలేదు. స్వచ్చ భారత్ క్యాంపెయిన్కు రావచ్చు కదా అని అడిగారు. బయట మురికిని కడగగలం కానీ మనసుల్లోని మకిలి, మలిని, అజ్ఞానం, గాఢాంధాకరం ఎవరు కడగాలి?.. అలాంటి మకిలి లేని, మలినాలు లేని రాజకీయాలను జనసేన తెస్తుంది. అదే ఛలోరే ఛల్.. ఉద్దేశం' అని చెప్పారు.
టీడీపీని గండికొట్టగలను
'అవసరమైతే ఆయుధం కూడా పట్టగల సత్తా ఉన్నవాడిని మరిచిపోకండి. తెలుగుదేశం విజయవకాశాలకు అప్పట్లోనే గండి కొట్టగలగి ఉండేవాడిని. కానీ చేయలేదు. ఎందుకు?.. జల్సాలో ఒక డైలాగ్ ఉంది. "చేతిలో కత్తి ఉండి.. చంపడానికి కారణాలు ఉండి.. తెగనరకడానికి తల ఉండి.. చంపకపోవడమే మానవత్వం. ఆ మానవత్వం నాకుంది. మీకుందా!" తెలుగుదేశం పార్టీకి ఇంకోసారి గండికొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి గుర్తుంచుకోండి' అని పవన్ హెచ్చరికలు జారీ చేశారు.'