పవన్ కళ్యాణ్ ది ఒక్కరోజు దీక్షే...ఆమరణ నిరాహార దీక్ష కాదు!
శ్రీకాకుళం: ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని, వెంటనే ఆంధ్రప్రదేశ్ లో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి నియమించాలనే తన డిమాండ్లపై ఎపి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానరాకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.
తన డిమాండ్ల నెరవేర్పుకు ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తూ హెచ్చరించే సమయంలో పవన్ ప్రకటించింది ఆమరణ నిరాహార దీక్ష కాగా ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేపట్టింది మాత్రం ఒక రోజు దీక్ష మాత్రమే కావడం గమనార్హం. పవన్ ఈరోజు సాయంత్రం 5గంటల నుంచి రేపు సాయంత్రం ఐదు గంటల వరకూ దీక్ష చేస్తారని తెలిసింది.

ఆర్భాటం లేకుండా...దీక్ష
భద్రతా సిబ్బంది గాయాల కారణంగా తన పర్యటనకు విరామం ఇచ్చిన పవన్ అంతకు రెండు రోజుల ముందు తాను చేసిన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన కనిపిస్తుందేమోనని చూశారు. అయితే ప్రభుత్వం నుంచి కనీస చర్యలు కరువవడంతో తాను ప్రకటించిన విధంగానే దీక్షకు దిగారు. అయితే ప్రస్తుతానికి పవన్ ఆమరణ నిరాహార దీక్ష కాకుండా ఒక్కరోజు నిరసన దీక్ష మాత్రమే చేస్తారని తెలిసింది. అయితే పవన్ ఇలా దీక్షకు దిగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయినప్పటికి ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రస్తుతం శ్రీకాకుళంలో ప్రస్తుతం తాను బస చేసిన రిసార్ట్స్ లోనే పవన్ దీక్షకు దిగారు.

ఇక్కడే ఎందుకంటే
అసలే సెక్యూరిటీ సిబ్బంది కొరత, దాంతో ఉన్న సిబ్బంది కూడా గాయాల పాలైన స్థితి...ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బైట దీక్షకు దిగడం అంటే జనాలను నిలువరించడం చాలా సమస్య. దీనివల్ల లేనిపోని సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అందుకే తాను బస చేసిన రిసార్ట్ లోనే దీక్ష చేపట్టేందుకు పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ముందు అలా...కానీ ఇప్పుడు ఇలా
అంతేకాకుండా పవన్ తొలుత తాను దీక్ష చేద్దామనుకున్నప్పుడు ఉద్దానం బాధితులతో కలసి చేద్దామని అనుకున్నారట. అయన పవన్ రాజకీయ సలహాదారుల సూచన మేరకు ఆలోచన విరమించుకున్నారట. అసలే బాధితులు...వారు వాళ్లంతట వాళ్లు దీక్ష చేస్తే ఫరవాలేదు కానీ పవన్ పిలిచి వవారిచే దీక్ష చేయించడం మంచిది కాదని...దానివల్ల ఇతరత్రా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వారు పవన్ కు సూచించడంతో పవన్ కూడా ఏకీభవించినట్లు తెలిసింది.

ఇక ముందు...గట్టి నిర్ణయాలే
అయితే తన డిమాండ్లపై టిడిపి ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువవడం పవన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు తెలిసింది. ఇకముందు టిడిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మరిన్ని దీక్షలు, అవసరమైన పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష కు దిగాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలా వుంటే పవన్ దీక్ష విషయం తెలిసి రాష్ట్రవ్యాప్తంగా పవన్ అభిమానులు, జనసేన పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో శ్రీకాకుళం తరలివస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications