బాబూ! లంచాలకు రసీదులిస్తారా?: అగ్రిగోల్డ్పై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
విజయనగరం: అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా ఈ రోజు(జూన్ 1, 1979)నే ఏర్పడిందని తెలిపారు.
ఆశా వర్కర్ల, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తీర్చాలని, వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సరైన జీతభత్యాలు అందించాలని పవన్ డిమాండ్ చేశారు.పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం తమ పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపరుచుతామని పవన్ హామీ ఇచ్చారు.

ఉద్యోగులకు అండగా..
కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా పర్మినెంట్ చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రజలకు అండగా నిలబడే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉండాలి కానీ, వారిని దోచుకునే ప్రభుత్వం ఉండకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు తాము అండగా ఉంటామని అన్నారు. తమకు వచ్చే ఎన్నికల్లో మెజార్టీ వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు నేరుగా పింఛను వచ్చేలా చేస్తామని, కేంద్రంతో పోరాడి సీపీసీని రద్దు చేస్తామని అన్నారు. తన తండ్రి కూడా పెన్షన్ మీద ఆధారపడి జీవించారని, తమ మీద ఆధారపడలేదని అన్నారు.

బాబూ.. లంచాలకూ రసీదులిస్తారా?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన అవినీతి నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారని.. అయితే, సీఎం లంచాలకు ఏమైనా రషీదులు ఇచ్చారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజల సమస్యల పట్ల చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం జనంలోకి వచ్చానని అన్నారు. హోదాపై 34సార్లు టీడీపీనే మాటమార్చిందన్నారు. హోదా, ప్యాకేజీ ఇస్తామని కేంద్రం అన్యాయం చేసిందన్నారు.

పవన్ హెచ్చరిక
అగ్రిగోల్డ్ బాధితులకి తమ పార్టీ అండగా ఉంటుందని, అలాగే ఆ సంస్థ ఆస్తులను చౌకగా కొట్టేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని పవన్ తేల్చి చెప్పారు. జనసేన ప్రభుత్వం వచ్చాక తిరిగి తీసుకుంటామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్రంలో అన్నిమూలాల ఉన్నారని అన్నారు.

అందుకే జనసేన బలంగా ఉండాలి.
చంద్రబాబు ప్రభుత్వం అనసవర ఖర్చులు చేస్తూ ప్రజల కోసం ఖర్చు చేయాలంటే డబ్బు లేవని చెబుతోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వస్తే రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. ఉద్దానం లాంటి సమస్యలపై నిలదీసేందుకైనా.. జనసేన అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉండాలని అన్నారు.

మా వల్లే నిరుద్యోగ భృతి
తమ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజనుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యువత జనసేనకు ఆకర్షితులవుతున్నందు వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని చెబుతోందని విమర్శించారు. ఇచ్చే నిరుద్యోగ భృతి కూడా అందరికీ కాదని, డిగ్రీ చదవితేనే నిరుద్యోగ యువకులుగా పరిగణిస్తారంటూ ధ్వజమెత్తారు. ఇలాంటివి మోసం చేసే పథకాలు తప్ప నిజంగా యువతకు న్యాయం చేసే పథకాలు కావన్నారు. ఇలాంటి పథకాలు పెడితే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.












Click it and Unblock the Notifications