నాకే ఆ పరిస్థితి ఉంటే.. ఇక సామాన్యుల గతి ఏంటి?, టీడీపీకి దమ్ముంటే ఆ పనిచేయాలి?: పవన్
శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు సీఎం అని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 'దమ్ముంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలి, ఎన్టీఆర్ ఫోటో పెట్టకోకుండా ఎన్నికల ప్రచారం చేపట్టాలి' అని సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా పోరుయాత్రలో భాగంగా పవన్ మంగళవారం జిల్లా కేంద్రంలో కవాతు నిర్వహించారు. అనంతరం సింహద్వారం వద్ద ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు.
Recommended Video
మళ్లీ అదే తప్పు, చంద్రబాబుకు త్వరలో రిటైర్మెంట్: పవన్ కళ్యాణ్, లోకేష్కు దిమ్మతిరిగే కౌంటర్
జనసేన ఒంటరిగానే..
ఇప్పటివరకు ఏ ఎన్నికలను పరిశీలించినా టీడీపీ ఏదో ఒక పార్టీతో జతకలిసే పోటీ చేసిందని పవన్ పేర్కొన్నారు. కానీ జనసేన మాత్రం రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని, తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. అన్నీ కుదిరితే తాను శ్రీకాకుళం జిల్లా నుంచే పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. చంద్రబాబుకు కృష్ణా జిల్లాపై ఉన్న మక్కువ.. ఇతర జిల్లాలపై లేదని విమర్శించారు. అమరావతి కేవలం టీడీపీ వాళ్ల కోసమేనని, అక్కడ సామాన్యులకు చోటు లేకుండా చేశారని మండిపడ్డారు.
నా పరిస్థితే అలా ఉంటే.. ఇక
'రూ.25 కోట్ల ఆదాయపు పన్ను కట్టిన నాలాంటి వాడికే రాజధానిలో కొంత స్థలం కొనడానికి 4 ఏళ్లు పట్టింది. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?' అని పవన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అభివృద్దినంతా ఒకేచోట కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే రాష్ట్రం ఇంకోసారి మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని పవన్ హెచ్చరించారు.
జన్మభూమి అవినీతి సంగతి తేలుస్తా..
జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాస్వామ్యం, స్థానిక సంస్థలను ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుదే అని, వాటి అవినీతి సంగతి చూస్తానని హెచ్చరించారు. ఇక లోకేశ్ పైనా పలు విమర్శలు గుప్పించారు పవన్. 'సీఎం గారి అబ్బాయి లోకేశ్ తన తండ్రి చంద్రబాబు వేయించిన రహదారులపై జనసేన నిరసన కవాతు చేస్తోందని అంటున్నారు. ఆ రహదారులకు కేటాయించిన డబ్బు మీ సొంత సొత్తా? మీ జేబుల్లో నుంచి తీసి రోడ్లు వేశారా? అని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలకు కూల్ డ్రింక్స్ వెళ్తున్నాయి కానీ రక్షిత మంచినీటికి మాత్రం దిక్కు లేదన్నారు. ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి రైల్వే స్టేషనే లేదని, దానికోసం ఇక్కడి నాయకులు పోరాడటం లేదని అన్నారు.
వాళ్లు పారిపోయారు..:
ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాలను పరిశోధించే వ్యవహారాన్ని ఆస్ట్రేలియా సంస్థకు అప్పగించామని సీఎం అంటున్నారని, అసలు ఈ సంస్థ ఎవరిదో? దానికి ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 1.5లక్షల రక్తనమూనాలు సేకరించామని ప్రభుత్వం చెబుతోంది. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అని నిలదీశారు. తాను ఒక్క మాట చెప్పినందుకే సొంత డబ్బులు పెట్టుకుని హార్వర్డ్ నుంచి వైద్యులు వచ్చారని, కానీ ఇప్పుడదే డాక్టర్లు ఉద్దానం గురించి మాట్లాడమంటేనే పారిపోతున్నారని అన్నారు. కారణం.. రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతిని చూసి వారు పారిపోయారని చెప్పుకొచ్చారు.