పవన్ కల్యాణ్ బిగ్ మిస్టేక్ - జగన్ చేతికి అస్త్రం..!?
ఏపీ ఎన్నికలు హోరా హోరీగా మారుతున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. టీడీపీ అయిదు స్థానాలు మినహా తమ ఎమ్మెల్యే అభ్యర్దులను ప్రకటించింది. బీజేపీ 10 స్థానాలు పొత్తులో తీసుకోగా, ఇప్పుడు మరో స్థానం కోరుతోంది. బీజేపీ తమ అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది. పవన్ తమ పార్టీ నుంచి పోటీ చేసే 21 స్థానాల్లో 18 మందిని ప్రకటించారు. పవన్ అభ్యర్దుల ఎంపికలో తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కొత్త టర్న్ కు కారణమవుతోంది.
జనసేన అభ్యర్దుల ఎంపిక
జనసేనకు కేటాయించిన 21 స్థానాల్లో పవన్ కల్యాణ్ ఇప్పటికే 18 మందిని అధికారికంగా ప్రకటన చేసారు. మరో మూడు స్థానాల్లో అభ్యర్దులను ఖరారు చేసారు. వారి పేర్లను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రెండు పార్లమెంట్ సీట్లలోనూ అభ్యర్దులను వెల్లడించనున్నారు. జనసేన ప్రకటించిన అభ్యర్దుల జాబితాలో సామాజిక సమతుల్యత లోపించిందనే చర్చ మొదలైంది. ప్రకటించిన 18 స్థానాల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించటం రాజకీయ ప్రత్యర్ధుల చేతికి అస్త్రంగా మారుతోంది. జనసేన ప్రకటించిన స్థానాల్లో 12 ఓసి లకు కేటాయించగా కేవలం అనకాపల్లి, నరసాపురం స్థానాలు మాత్రమే బీసీలకు ఖరారు చేశారు. జనసేన కోసం ఐదేళ్ల కాలంగా పనిచేస్తున్న బీసీ నేతలకు ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలు మొదలయ్యాయి.

సామాజిక సమీకరణాలు
మిగిలిన మూడు స్థానాల్లో అవనిగడ్డ కాపు వర్గానికి, పాలకొండ - ఎస్టీ మహిళ, విశాఖ సౌత్ - బీసీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ లెక్కన మొత్తం 21 స్థానాల్లో మూడు బీసీ, రెండు స్థానాలు మహిళలకు ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. పార్టీ కోసం తొలి నుంచి పని చేస్తున్న వారికి సీట్లు దక్కలేదనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. దాదాపు 13 స్థానాలు ఓసీలకు ఇవ్వటం కూడా ప్రత్యర్ధి పార్టీ అనుకూల ప్రచారంగా మాలచుకొనే అవకాశం కనిపిస్తోంది. గోదావరి జిల్లాలో కీలక వర్గంగా ఉన్న శెట్టిబలిజ వర్గానికి ఇప్పటివరకు సీటు కేటాయించలేదు. కాకినాడ మాజీ మేయర్ పోతనపల్లె సరోజ జనసేన సభ్యత్వానికి రాజీనామా చేశారు. జనసేనకు పట్టున్న ప్రాంతంలో సీట్లలో సామాజిక సమతుల్యత లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఎవరికి కలిసొచ్చేను
వైసిపి సామాజిక న్యాయం పేరుతో గోదావరి జిల్లాల్లో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంటే జనసేన మాత్రం విశాఖలో ఒక స్థానం పశ్చిమగోదావరిలో మరొకటి బీసీలకు కేటాయిస్తే మొత్తంగా రెండు సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించినట్లవుతుంది. అటు పిఠాపురం కేంద్రంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ కాపు వర్గంతో పాటుగా బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారితో కలిపి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ పెద్ద మొత్తంలో బీసీలకు సీట్లు కేటాయించటం ద్వారా ఆ వర్గాలతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్ బ్యాంక్ పైన నమ్మకం పెట్టుకున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఓసీలకు పెద్ద పీట వేస్తూ సీట్ల కేటాయింపు రాజకీయంగా ఎన్నికల వేళ ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications