మూడు రాజధానులు తాత్కాలికమే: అమరావతే శాశ్వతం: ప్రభుత్వంపై పవన్ ఫైర్..!
మూడు రాజధానుల నిర్ణయం...పోలీసులు..ప్రభుత్వం తీరు పైన జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తాత్కాలికమేనని.. అమరావతే శాశ్వత రాజధాని అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానుల అంశం..అమరావతిలో నిరనసనల పైనా ఆయన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించారు. వైసీపీకి నాశనం మొదలైందని... పోలీసులను నియమించి, ప్రజలను భయభ్రాంతులను చేసిందనన్నారు. నిరసన వ్యక్తం చేసిన ప్రజలపై లాఠీలను ప్రయోగించి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిందని పవన్ మండిపడ్డారు. ఏపీ రాజధాని అమరావతేనని బీజేపీ కూడా స్పష్టం చేసిందన్న పవన్... మంగళవారం బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
తరలింపు తాత్కాలికమే..
మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు ఎంతోకాలం మనుగడ సాధించలేవని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖ, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని ఆయా ప్రాంతాల మీద ప్రేమతో ఏర్పాటవుతున్నవి కాదు. విశాఖలో పుష్కలంగా ఉన్న భూసంపదను చేజిక్కించుకోవడమే వైసీపీ పెద్దల వ్యూహమంటూ విమర్శించారు. విశాఖను ఫ్యాక్షనిస్టుల నుంచి జనసేన-బీజేపీ కాపాడుకుంటాయని చెప్పుకొచ్చారు. రాయలసీమలో హైకోర్టు నిర్మించడాన్ని సమర్థిస్తున్నామని, కానీ వైసీపీ ప్రతిపాదించిన 3రాజధానులకు తాము వ్యతిరేకమని చెప్పారు. రాజధాని పేరుతో అప్పట్లో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారంచేస్తే ఇప్పుడు రాజధానిని మార్చి వైసీపీ రియల్ ఎస్టేట్ చేస్తోందని ఆరోపించారు.

బీజేపీతో చర్చించి కార్యాచరణ..
మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేయటంతో..భవిష్యత్ కార్యాచరణ గురించి పవన్ కళ్యాణ్ బీజేపీతో చర్చించాలని నిర్ణయించారు. ఈ రోజు బీజేపీ అగ్ర నాయకత్వంతో చర్చిస్తామని స్పష్టం చేసారు. ఆ తరువాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. అయితే, అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన రైతుల పైన పోలీసుల లాఠీచార్జ్ ను పవన్ తీవ్రంగా పరిగణించారు. గాయాల పాలైన వారిని పరా మర్శించేందుకు వెళ్తానంటే పోలీసులు అడ్డుకోవటం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రోజు ఎలాగైనా బాధితులను పరామర్శించాలని జనసేన భావిస్తోంది. పవన్ పర్యటనను అడ్డుకున్న పోలీసులు..ఒక రకంగా పవన్ ను పార్టీ కార్యాలయంలోనే హౌస్ అరెస్ట్ చేసారు. వైసీపీ లాంటి విభజించి పాలించే పార్టీని అడ్డుకోవాలంటే బీజేపీ- జనసేన వల్లే సాధ్యమని పవన్ పేర్కొన్నారు. వైసీపీ పిచ్చితనానికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వం, పోలీసుల తీరు దుర్మార్గమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications