పవన్ కు వర్మ సహకారం సాధ్యమేనా - పిఠాపురం తాజా లెక్కలేంటి..!!
ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు పిఠాపురం కీలకంగా మారుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక, భీమవరంలో పవన్ ఓడిపోయారు ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనేది పవన్ లక్ష్యం. పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించిన వెంటనే అక్కడ టీడీపీ ఇంఛార్జ్ వర్మ మద్దతు దారులు రభస సృష్టించారు. వర్మతో చంద్రబాబు మాట్లాడారు. ఇటు పవన్ పిఠాపురం వెళ్తున్నారు.
పిఠాపురం రాజకీయం
పిఠాపురం నుంచి మరోసారి పోటీ చేసి నెగ్గాలనేది వర్మ లక్ష్యం. పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నారు. వర్మ మద్దతు దారులు ఈ విషయం పవన్ ప్రకటించిన వెంటనే ఆందోళన చేసారు. చంద్రబాబు తన వద్దకు పిలిపించుకొని పవన్ గెలుపుకు సహకరించాలని వర్మను కోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. పవన్ అందుకు సమ్మతించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో తన కేడర్ తో సమావేశమయ్యారు. చంద్రబాబు చేసిన సూచనలను వివరించారు. అయితే, కేడర్ మాత్రం తాము జనసేనతో ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టింది, కాకినాడ నుంచి వచ్చిన కొందరు తమతో దురుసగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేసారు.

వర్మ మద్దతు కీలకం
దీంతో, వర్మ సైతం ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు సూచనతో పవన్ గెలుపుకు సహకరిస్తామని చెబుతూనే..తనకు కేడర్ ముఖ్యమని స్పష్టం చేసారు. తమకు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చిత్తశుద్దితోనే పని చేస్తున్నామని చెప్పారు. జనసేన కేడర్ తమతో కలిసి వస్తుందా లేదా అనేది నిర్ణయం వారికే వదిలేసామని పేర్కొన్నారు. చంద్రబాబు సూచనతో పవన్ కోసం పని చేయటానికి తాను సిద్దమేనని వర్మ చెబుతున్నా.. ఆయన మద్దతు దారులు చేస్తారా లేదా అనేది సమస్యగానే కనిపిస్తోంది. దీంతో, మరో నాలుగు రోజుల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం వస్తున్నారు. అక్కడ రెండు పార్టీలకు చెందిన నేతలు, కేడర్ తో సమావేశం కానున్నారు. వర్మ ఇప్పటికీ పవన్ ను గెలిపించుకుంటామని చెబుతూనే..టీడీపీని కాపాడుకుంటామని నినదిస్తున్నారు.
పిఠాపురంకి పవన్
పవన్ పిఠాపురంలో గెలుపుకు వర్మ సహకారం కీలకంగా మారుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ. జనసేన కూటమి పైన వర్మ 47 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో, ఈ సారి సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలని మద్దతు దారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, చంద్రబాబు సూచన మేరకు పని చేద్దామని వర్మ నచ్చ చెబుతున్నారు. అటు వైసీపీ నుంచి వంగా గీత పోటీలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశం ఉంది. పవన్ ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. దీంతో..స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలే కీలకం అవుతున్న వేళ.. పవన్ పిఠాపురంకు వచ్చిన తరువాత రాజకీయంగా ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications