భయపెట్టేవాడు నాయకుడు కాదు: జగన్ ఇలాకాలో పవన్ కళ్యాణ్పై పూలవర్షం
కడప/కర్నూలు: జనసేన పోరాట యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం కడప జిల్లాలో అడుగుపెట్టారు. ఆయనకు కడపలో ప్రజలు నీరాజనాలు పట్టారు. దేవుని కడప నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు రోడ్డు షో నిర్వహించారు. వందలాది బైకులతో ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జనసేనానిపై పూలవర్షం కురిపించారు.
మైదుకూరులో జనసేనానికి ఘన స్వాగతం
కర్నూలు జిల్లా పర్యటన ముగించుకొని, కడప జిల్లాకు వచ్చిన జనసేనానికి మైదుకూరు వద్ద వేలాది మంది జనసేన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. వాహనశ్రేణిపైకి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు. మైదుకూరు రహదారులు కిక్కిరిసిపోయాయి. పవన్ జనసందోహాన్ని దాటి కాన్వాయ్ ముందుకు రావడానికి అరగంట పట్టింది. దారి పొడవునా ప్రజలు జనసేన జెండాలతో స్వాగతం పలికారు. కాజీపేట, చెన్నూరులలో వేలాది మంది ప్రజలు వచ్చి పూలవర్షం కురిపించారు.
కడప నగరమంతా హోర్డింగులు
దేవుని కడప ఆర్చ్ నుంచి కడప నగరంలోకి ప్రవేశించారు పవన్ కళ్యాణ్. స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శ్రీనివాసుడికి నమస్కరించి, ఆ తర్వాత కడప నగరంలోకి ప్రవేశించారు. కడప నగరమంతా జనసేనానికి స్వాగతం పలుకుతూ హోర్డింగులు వెలిశాయి. సీఎం.. సీఎం అంటూ అభిమానులు, జనసైనికులు నినాదాలు చేశారు.
భయపెట్టేవాడు నాయకుడు కాదు
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అందరి నాయకుల్లా తన పేరు వెనుక కులం లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఉతికి ఆరేసిన పార్టీ జనసేన అని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. భయపెట్టేవాడు నాయకుడు కాదని, స్వేచ్ఛను ఇచ్చేవాడు నాయకుడు అవుతాడని చెప్పారు. ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొట్టి తీరుతామని చెప్పారు.
కేసీఆర్.. పరిటాల సునీత ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తారు..
అంతకుముందు, కర్నూలులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి పరిటాల సునీత వంటి రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లకు ఎందుకు వెళ్లారని చాలామంది ప్రశ్నిస్తుంటారని, వాళ్లంటే ఎప్పుడూ తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, ఒకే రంగంలో ఉన్నప్పుడు మాట్లాడుతుండాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్లను అడిగేవాడు కావాలని, సయోధ్యతోనే సమస్యకు పరిష్కారం రావాలనే ఎప్పుడూ కోరుకుంటానని పవన్ చెప్పారు. సయోధ్య కుదరని పక్షంలోనే యుద్ధం చేస్తానని చెప్పారు.