వైసీపీ పోస్టర్ చించారని రోజంతా పీఎస్ లో మైనర్లు-జాతీయ మీడియా వీడియో- ట్వీట్ చేసిన పవన్
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై నిత్యం పోరాడుతున్న విపక్ష పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ట్విట్టర్ వేదికగా మరోసారి ఆ పార్టీని టార్గెట్ చేశారు. పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన జాతీయ మీడియాలో కలకలం రేపింది. ఈ వీడియోను తన ట్వీట్ కు జత చేసి మరీ పవన్ వైసీపీని టార్గెట్ చేశారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ పోస్టర్ చించారని కొందరు మైనర్లను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ వారిని రోజంతా ఉంచారు. పోలీసు స్టేషన్లలో ఉంచిన మైనర్లను విచారించారా, అరెస్టు చేసారా అన్నది తెలియకపోయినా స్టేషన్లో మాత్రం వారు ఉన్న దృశ్యాలు బయటికి వచ్చాయి. వీటిపై జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఇందులో మైనర్లు పీఎస్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే మైనర్లను పీఎస్ కు తీసుకురావడాన్ని పోలీసులు నిర్ధారించినట్లు కూడా పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో కలకలం రేపింది.

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ పోస్టర్ చించారన్న కారణంతో మైనర్లను పోలీసుస్టేషన్ కు పిలిపించి రోజంతా ఉంచి ఘటనపై విపక్ష టీడీపీ తప్పుబట్టినట్లు కూడా ఇండియా టుడే తన కథనంలో చూపించింది. ఇదే వీడియోను ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే కాదు వైసీపీ ప్రభుత్వం మైనర్లను కూడా వదలడం లేదంటూ ఓ కామెంట్ కూడా పెట్టారు. బాధాకరం అంటూ వ్యాఖ్యానించారు.
YCP Govt is not even sparing kids. Sad.. https://t.co/qXkZD9tBjc
— Pawan Kalyan (@PawanKalyan) April 27, 2022
దీంతో పవన్ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన ఏపీలోని ప్రధాన మీడియా ఛానళ్లలో మాత్రం కనిపించలేదు. మరోవైపు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అందుకు తగినట్లుగానే అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications