భూసేకరణపై పోరు, రాం జెఠ్మలానీ వ్యాఖ్యలతో పవన్ ట్వీట్: మంత్రి నో కామెంట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణ చేస్తున్న తీరుపై మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన శనివారం మరోసారి స్పందించారు. ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ తన అంతరంగాన్ని బయట పెట్టారు.
దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నంత కాలం ఓ రాజకీయ పార్టీకి విధేయత ప్రదర్శించడానికి అర్థం ఉంటుందని, రాజకీయ పార్టీ విధానాలు, చర్యలు దేశాన్ని నాశనం చేస్తుంటే, విధేయత చూపడం దేశం పట్ల నేరానికి పాల్పడడంతో సమానమని, రాజకీయాలకు దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం కావాలని రాంజెఠ్మలానీ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ట్వీట్ చేశారు.
— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2015 ఇదిలావుంటే, పవన్ కళ్యాణ్ ట్వీట్లపై తాను మాట్లాడదలుచుకోలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి, బిజెపి నాయకుడు పైడికొండల మాణిక్యాల రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రైతులు అంగీకరించకపోయినా భూసేకరణ తప్పదని ఆయన శనివారం మీడియాతో అన్నారు. రాజధాని నిర్మాణం జరగాలంటే భూములు కావాల్సిందేనని అన్నారు.

పార్లమెంటులో భూసేకరణ చట్టాన్ని అన్యాయంగా అడ్డుకున్నది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. కాంగ్రెసు నేతలకు రోడ్లపై తిరిగే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండదని ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసును ఛీకొట్టినా ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications