నేడు రాజధాని లంక భూముల రైతులతో పవన్ సమావేశం...
విజయవాడ: జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆదివారం ఉదయం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. తొలుత ఆయన ఉద్దండరాయునిపాలెం లోని లంక భూములకు చెందిన ఎస్సీ రైతులను కలసి వారి సమస్యలపై చర్చించనున్నారు.
విజయవాడలో ఉన్న పవన్ కళ్యాణ్ ను శనివారం వచ్చి కలసిన ఉద్దండరాయునిపాలెం రైతులు లంకభూముల పరిహారం విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని తెలిపారు. ఈ భూములకు తగిన పరిహారం ఇవ్వడం లేదని వివరించారు. దీనిపై స్పందించిన పవన్ తాను మీ ప్రాంతానికే వస్తానని, అక్కడికే వచ్చి స్వయంగా పరిశీలించి సమస్య పరిష్కారం కోసం ఏం చెయ్యాలో చర్చిద్దామని రైతులతో చెప్పారు. ఆ మేరకు ఆదివారం ఉదయం పవన్ ఉద్దండరాయునిపాలెం వెళుతున్నారు. అలాగే స్థానిక సమస్యలను ఆధారం చేసుకొని పవన్ రాజధానిలోని మరి కొన్ని ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా పరిణామాలను బట్టి ఉద్దండరాయునిపాలెం లంక భూముల సమస్యకు పవన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కారణం వీరు ఎస్సీ రైతులు కావడం...ఈ సమస్యపై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో చర్చ జరిగిన నేపథ్యంలో పవన్ ఈ విషయమై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. తమకు జరుగుతున్న అన్యాయం విషయమై ఉద్దండరాయునిపాలెం ఎప్పట్నుంచో పోరాడుతున్నా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఫిర్యాదు కాబట్టి, కేంద్రంలో టిడిపి-బిజెపి మిత్రపక్షాలు కాబట్టి వారి గోడు అరణ్యరోదనే అయింది. గతంలో ఇక్కడ పర్యటించిన ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యులు పి ఎం కమలమ్మ రాజధాని ప్రాంత దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని, ఇది ఒక రకంగా ప్రభుత్వ దురాగతమని చెప్పడం గమనార్హం. దళిత రైతుల పట్ల వివక్ష గురించి ఎపి ప్రభుత్వాన్ని వివరాలడిగినా ఇవ్వడం లేదని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడం లేదనీ ఆ సందర్భంగా పి ఎం కమలమ్మ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉద్దండరాయునిపాలెం పర్యటన అధికార పార్టీ టిడిపికి ఇబ్బందకరంగా పరిణమించడం ఖాయంగా కనిపిస్తోంది. కారణాలేమైనప్పటికి రాజధాని ప్రాతంలో భూములు ఇచ్చిన రైతుల్లో అత్యధికులు తమకు అన్యాయం జరిగిందన్న భావనలో నేపథ్యంలో పవన్ వారి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం టిడిపిని ఇరుకునపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ తాజా పర్యటనలో రాజధాని రైతులకు సబంధించిన మరిన్ని సమస్యలు వెలుగులోకి వస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications