చంద్రబాబు వ్యవహరించిన తీరు భేష్: పవన్, మోడీపైనా
విజయవాడ: తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాగుందని ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని పవన్ కోరారు. ఉత్తరాంధ్రలో తుఫాను బాధితులను పరామర్శించేందుకు బయల్దేరిన పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. దివిసీమ ఉప్పెన తర్వాత సంభవించిన అతిపెద్ద తుఫాను ఇదేనని పవన్ కళ్యాణ్ అన్నారు. తుఫాను వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
ప్రతి ఒక్కరూ మాటల్లో కాకుండా చేతల్లో సాయం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి అందించిన సాయంపై పవన్ స్పందిస్తూ.. మోడీ మాట నిలబడే వ్యక్తి అని అన్నారు. అందుకే ఎన్నికల్లో మద్దతిచ్చానని తెలిపారు. తుఫాను బాధితులకు అవసరమైన మేర సాయం చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విఐపీలు ఎంత తక్కువ వస్తే అంత మంచిదని వ్యాఖ్యానించారు. అనంతరం విశాఖ పర్యటనకు బయల్దేరారు. గురువారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు.
బుధవారం సాయంత్రం విశాఖలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. షిప్పింగ్ హార్బర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఆయనతోపాటు మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపి కంభంపాటి హరిబాబు ఉన్నారు.
తుఫాను బాధితుల సహాయార్థం పవన్ కళ్యాణ్ రూ. 50లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుధుద్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని, విశాఖనగరం తుడిచిపెట్టుకుపోవడం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
దుర్భర పరిస్థితుల్లో చిక్కుకున్న లక్షలాది మంది పరిస్థితి ఊహించలేని విధంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణం తన హృదయాన్ని తీవ్రంగా కలచి వేసిందని.. ఇలాంటి సమయంలోనే బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని ఆయన కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుఫాను సాయం చేస్తున్నా.. తన వంతుగా రూ. 50లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు. బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని, ఆయా ప్రాంతాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చారు.