ఇంకో దాడి జరిగితే...: ఎమ్మెల్యే ద్వారంపూడి, వైసీపీ సర్కారుకు పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆదివారం జరిగిన దాడిలో గాయపడిన జనసేన నేతలను, కార్యకర్తలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ద్వారంపూడిని క్షమించలేం..
ఎమ్మెల్యే ద్వారంపూడి వాడిన భాష, తిట్టిన తిట్లు క్షమించరాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాప్రతినిధులు ఈ రకంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. మీరే తిట్టి.. మీరే దాడి చేసి.. మా పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడతారా? అని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే.. పచ్చిబూతులు తిట్టారు.. కారణం లేకుండా దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల బాధ్యత రాహిత్యం..
నిరసనలు చేపట్టిన ఆడపడచులు, నేతలపై దాడులు చేశారని మండిపడ్డారు. పోలీసులు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే సహించమని అన్నారు. తమ సహనాన్ని చేతకాని తనం అనుకోవద్దని తేల్చి చెప్పారు పవన్ కళ్యాన్. బలం ఉన్న వాళ్లం కాబట్టే భరిస్తున్నామని అన్నారు.
ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకొస్తాంటే సహించం
రెచ్చగొట్టాలి, శాంతి భద్రతలకు విఘాతం సృష్టించాలనుకుంటే వైసీపీ నేతలు ఇక్కడ ఉండలేరని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకొస్తామంటే సహించమని అన్నారు. అమరావతి రైతుల కోసం పాదయాత్ర చేస్తామంటే అక్కడి పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు.
వైసీపీ పాలన అంటే పాలేగాళ్లు.. ఫ్యాక్షన్ రాజకీయాలే..
వైసీపీ పాలన వస్తే రాష్ట్రంలో పాలేగాళ్లు, ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయని తాను 2014, 2019 ఎన్నికల్లో చెప్పానని.. ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. గోదావరి జిల్లాల్లో ఇలాంటి భాష మాట్లాడే నాయకులను, ఇలాంటి ఘటనలను తాను చూడలేదని అన్నారు. కారణం లేకుండా దాడి చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని అన్నారు.పోలీసులే సుమోటాగా ఈ దాడిని తీసుకోవాలని, కేసు నమోదు చేయాలన్నారు.
చేతులు కట్టుకుని కూర్చోం..
151 ఎమ్మెల్యేలు దిగొచ్చారా? అని ప్రశ్నించారు. తాము ఇంకా నియంత్రణలోనే ఉన్నామని చెప్పారు. పోలీసులు, ఉన్నతాధికారులు, రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి ఇకనైనా బాధ్యతగా ఉండాలన్నారు. తమ వాళ్ల మీద ఇంకొక్క సంఘటన జరిగితే తాము చేతులు కట్టుకుని కూర్చోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇక్కడ ఎవరూ తిరగలేరని అన్నారు.