Pawan Kalyan:వారాహి యాత్రతో జనసేనాని చంద్రబాబును టార్గెట్ చేశారా..?
Pawan Kalyan:ఈ నెల 14 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వల్ల వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీనే ఎక్కువగా నష్టపోతోందా? తెలుగుదేశం- జనసేన పొత్తులో భాగంగా సీఎం పదవి సైతం వదులుకుంటానని, జగన్ను ఓడించడమే లక్ష్యమని నిన్నటి వరకూ మాట్లాడిన పవన్ కళ్యాణ్, వారాహి యాత్ర సభల్లో ''మీరు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిని అవుతానని ఎందుకు కొత్త పల్లవి అందుకుంటున్నారు? వామపక్షాలకు ఇచ్చినట్లు తెలుగుదేశం నెగ్గలేని సీట్లను పొత్తులో జనసేనకు కేటాయించి మమ అనిపించుకోవాలన్న చంద్రబాబు ఎత్తుగడలకు పవన్ వారాహి యాత్ర ద్వారా చెక్ చెబుతున్నారా? నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
టిడిపి-జనసేన పొత్తుకు సీఎం పదవి అడ్డొస్తుందా?
ఏపీలో 2014లో జనసేన-టిడిపి-బిజేపీ కలిసి పోటీ చేశాయి. అధికారంలోకి వచ్చాయి. బిజేపీ-టిడిపి అధికారంలో కూడా భాగస్వామ్యులయ్యాయి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014లోనేకాదు, 2019లో కూడా రెండు చోట్ల పోటీ చేసినా ఒక్క చోట గెలవలేకపోయారు. గత ఎన్నికల్లో జనసేన తరఫున రాజోలులో గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక కూడా వైసీపీతో కలిసిపోయారు. ఈ పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు పక్షంలో చేరి పోటీ చేస్తామని నిన్నటివరకు జనసేన నేతలు అధికారికంగా ప్రకటించారు. ఏపీలో అరాచక శక్తులను ఓడించేందుకు సీఎం పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించారు పవన్ కళ్యాణ్.

కానీ ఇంతలో ఏమైందో ఏమోకానీ, వారాహియాత్ర జనవాణి సభల్లో మాత్రం తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. అధికార పార్టీ నేతలను తన ప్రసంగంలో టార్గెట్ చేస్తున్నప్పటికీ, టిడిపి-జనసేన మధ్య దాదాపు పొత్తు కుదిరిపోయిందనుకుంటున్న తరుణంలో పవన్ కొత్త రాగం మళ్లీ ఇరుపార్టీల శ్రేణుల్ని సందిగ్ధంలో పడేసింది. 2024 ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తులో సీట్ల సంఖ్య కంటే సీఎం పదవికి సంబంధించిన పేచీ ఒక పట్టాన తెగేలా కనిపించడం లేదని జనసేన నేత ఒకరు తెలిపారు.
పవన్ కొత్త నినాదంతో కంగుతున్న టిడిపి!
ఈనెల 14 నుంచి 25 వరకు అన్నవరం నుంచి నరసాపురం వరకూ వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది.ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాత్రలో పవన్ కళ్యాణ్ కేవలం వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అధికార పార్టీ నేతల అక్రమాలు, అవినీతినే ప్రశ్నిస్తారనుకుంటే, తనను ముఖ్యమంత్రి చేయాలంటూ ఎత్తుకున్న నినాదంతో తెలుగుదేశం శ్రేణులు ఒక్కసారిగా కంగుతిన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

పవన్ యాత్రపై వైసీపీ సెటైర్లు
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి కాదని చెబుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రి చేయడమే పవన్ అజెండా అని వైసీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శిస్తున్నారు. పవన్కు ఈ యాత్ర షూటింగ్లో ఒక భాగమని ఎద్దేవా చేశారు మరో వైసీపీ నేత పేర్ని నాని. అంతేకాదు, పవన్ ఒక చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా యాత్ర చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో చెబుతున్నారు. ఇతర పార్టీలకూ, జనసేన పార్టీకి ఉన్న వ్యత్యాసం గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కులాలు , వర్గాలను దాటి రాజకీయం చేయాలని పవన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. ఒక కులానికి ఒక పార్టీ అన్న భావన తప్పు అని చెబుతున్నారు.

ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపించాలని.. తనను ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసి చూడండని ప్రజలను వేడుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ వైసీపీకి ఆట విడుపుగా మారితే, తెలుగుదేశం పార్టీకి పజిల్గా మారాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత ఒకరు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ యాత్ర అధికార పార్టీకి సవాలుగా లేదని, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడుకు తాను అడిగినవన్నీ ఇస్తేనే పొత్తు, లేకుంటే లేదు అన్న వార్నింగ్లా ఉందని ఆ నేత చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications