డిప్రెషన్లో జగన్! ఉరవకొండలో సిద్ధమేనా?: పయ్యావుల సవాల్
హైదరాబాద్/విజయవాడ: తనపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై తెలుగుదేశం ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు పేరున భూమి కొనడం తప్పా అని ప్రశ్నించారు. రాజధానిని ప్రకటించిన 2 నెలల తర్వాత తాను భూమి కొనుగోలు చేసినట్లు చెప్పారు. తన వద్ద 5వేల ఎకరాలు భూమి తన వద్ద ఉందని రాసిన సాక్షి మీడియా.. తాను 4 ఎకరాల భూమిని కొనలేని స్థితిలో ఉన్నానని అనుకుంటుందా? అని ప్రశ్నించారు.
సాక్షిలో తనపై వచ్చిన ఆరోపణల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించాలన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై చర్చించేందుకు తాను సిద్ధమేనని, అందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమేనా? అని జగన్కు ఆయన సవాల్ విసిరారు.
ఉరవకొండకు వస్తానంటే.. అక్కడైకైనా తాను వచ్చేందుకు సిద్ధమేనని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఇడుపులపాయలో వైయస్ జగన్ వందల ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తన మూడు తరాల వారి ఆస్తుల మీద.. జగన్ మూడు తరాల ఆస్తుల మీద చర్చించేందుకు జగన్ సిద్ధమేనా? అంటూ సవాల్ చేశారు.

జగన్మోహన్ రెడ్డికి కొమ్ములేమీ లేవని, ఆయన కోడిని కూడా కోయలేరన్న విషయం తనకు తెలుసునని ఆయన అన్నారు. సాక్షి మీడియా కథనాలపై తాను జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరితే.. అంబటి రాంబాబుతో మాట్లాడిస్తున్నారని.. జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్పందించాలని అన్నారు.
జగన్ వ్యక్తిగత ఆస్తులను వెల్లడించగలరా? అని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతులపై జరుగుతున్న దాడిగా పయ్యావుల అభివర్ణించారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నంగా చెప్పారు. జగన్ పార్టీ నేతలు ఓ స్టాల్ ప్రారంభించి.. ఎవరు భూములు కొనుగోలు చేస్తున్నారు? అమ్మకాలు చేస్తున్నారనేదానిపై రాసుకోవాలని చెప్పారు.
అనవసర ఆరోపణలు చేసి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పకపోతే.. పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి డిప్రెషన్లో ఉన్నారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటం, మరో వైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో నమ్మకం పోతుండటంతో జగన్మోహన్ రెడ్డి అసహనానికి గురవుతున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications