సభను అడ్డుకుంటాం: టీ బిల్లు చర్చపై పయ్యావుల
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా తాము కచ్చితంగా శాసనసభా కార్యక్రమాలను అడ్డుకుంటామని తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. పూర్తి సమాచారం ఇచ్చి, దాన్ని అధ్యయనం చేసిన తర్వాత చర్చకు అనుమతించాలని, పూర్తి సమాచారం లేకుండా చర్చను ప్రారంభిస్తే తాము అడ్డుకుంటామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బిల్లుపై కేంద్రానికి స్పష్టత లేదని, విభజనకు సహేతుకమైన కారణలు తెలియజేయలేదని ఆయన అన్నారు.
ఆస్తుల, అప్పుల వివరాలతో పాటు మిగతా సమాచారమంతా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదాయవ్యయాలపై సమాచరాం పెట్టాలని ఆయన అన్నారు. ఆస్తులను విలువ కట్టి సభలో ప్రవేశపెట్టాలని, అప్పుడే అర్థవంతమైన చర్చ జరుగుతుందని ఆయన అన్నారు. ఉద్యోగావకాశాలపై, విద్యావకాశాలపై, ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులపై, విద్యుత్తు కేటాయింపులపై సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు. విభజన జరిగితే ఉద్యోగుల్లో ఎవరు ఎటు వెళ్తారనే సమాచారం లేదని ఆయన అన్నారు.
పూర్తి సమాచారం ఇస్తేనే శాసనసభలో చర్చను కొనసాగించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. అనేకానేక ప్రశ్నలకు సమాధానం రావాలంటే, విభజన పరిణామాలను తెలుసుకోవాలంటే పూర్తి సమాచారం సభ ముందు పెట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సభకు విరామం ఇచ్చి, సభ్యులకు పూర్తి సమాచారం అందించి, ఆ తర్వాత సభలో బిల్లును చర్చకు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు సీమాంధ్ర, తెలంగాణ ప్రజలకు ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లును చించేయడం అప్రజాస్వామికమని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ మాటలపై ఆయన ప్రతిస్పందించారు. తమకు నీతిసూత్రాలు చెప్పే ముందు, తమకు హితబోధ చేసే ముందు రాహుల్ గాంధీకి చెప్పాలని, ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ గాంధీ మాటలను గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. తాము దిగ్విజయ్ సింగ్ నీతిసూత్రాలను, హితబోధలను వినడానికి సిద్ధంగా లేమని పయ్యావుల అన్నారు.
ఢిల్లీలో బొత్స, ఇంట్లో కిరణ్ పడుకున్నారు
ఆరోగ్యం బాగా లేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో పడుకున్నారని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులుగా సీమాంధ్ర ప్రజల ఆవేదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదా అని ఆయన అడిగారు. సమైక్యవాదాన్ని కాపాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి గొంతు ఎందుకు మూగబోయిందని ఆయన ప్రశ్నించారు.
యుద్ధవిమానంలో వచ్చిన బిల్లును అంతకన్నా వేగంగా మంగళయాన్లో పంపిస్తానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి మాటల్లో ఉన్న వాడి చేతల్లో లేదని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్ర మంత్రులు కొందరు ఎందుకు నోరు విప్పడం లేదని అడిగారు. వాళ్లంతా కాంగ్రెసు అధిష్టానానికి అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ప్రజల ఉద్యమాన్ని, ఆకాంక్షలను, సమైక్యవాదాన్ని సోనియా గాంధీకి తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. స్పీకర్ మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని పట్టించుకోవడంలేదని అన్నారు.