టిడిపిలో చేరాలని ఫోన్లు, అదీ చూద్దాం: మైసూరాపై పెద్దిరెడ్డి, ఇదీ కారణం..
ఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బుధవారం సాయంత్రం పార్టీని వీడిన మైసూరా రెడ్డి పైన దుమ్మెత్తి పోశారు. జగన్ను డబ్బు మనిషి, అపరిచితుడు అన్న మైసూరాకు కౌంటర్ ఇచ్చారు. జగన్ డబ్బు మనిషి కాదన్నారు. మైసూరానే డబ్బు మనిషి అన్నారు.
అలాగే, జగన్ అపరిచితుడు కాదని, మైసూరా రెడ్డికే అది వర్తిస్తుందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం మైసూరా టిడిపిలోకి వెళ్తున్నారని చెప్పారు. జగన్ డబ్బు మనిషి కాదన్నారు. పార్టీ అధినేతగా జగన్ తామందర్నీ గౌరవిస్తారని, గౌరవిస్తున్నారని చెప్పారు.
మా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడం వెనుక మైసూరా
మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్పించేందుకు మైసూరా రెడ్డి ఆరు నెలలుగా అందరికీ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. డబ్బు యావ జగన్కు లేదని, మైసూరాకే ఉందని చెప్పారు. హైటెక్ సిటీ పేరుతో చంద్రబాబు తన అనుచరులకు ఎలా లబ్ధి చేకూర్చారో అందరికీ తెలుసునని చెప్పారు.
రాజధాని పేరుతో అమరావతిలోను చంద్రబాబు ఇప్పుడు అలాగే చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సచ్ఛీలుడు అయితే సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. జగన్ పైన మైసూరా ఆరోపణలు హాస్యాస్పదం అన్నారు.
రాయలసీమ పరిరక్షణ ఉద్యమానికి తాము మద్దతివ్వడం లేదని మైసూరా చెప్పడం సరికాదన్నారు. తాము అసెంబ్లీలో రాయలసీమ గురించి చాలాసార్లు మాట్లాడామని చెప్పారు. చంద్రబాబు అక్రమాల పైన జగన్ పుస్తకం విడుదల చేయగానే పద్ధతి ప్రకారం టిడిపి మైసూరాతో లేఖ రాయించిందని విమర్శించారు.
రాయలసీమ ఉద్యమం పైన మైసూరా రెడ్డి మూడుసార్లు మాట మార్చారన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేలను పిలిచి వాయిదా వేశారన్నారు. జమ్మలమడుగులో మైసూరా సోదరుడి కొడుకును సమన్వయకర్తగా నియమించామని చెప్పారు. దీనిని నెపంగా పెట్టుకొని ఏవేవో లేఖలు రాశారన్నారు.
అపరిచితుడు మైసూరాయేనని, మరెవ్వరూ కాదన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారని భావించి టిడిపి నుంచి తమ పార్టీలోకి వచ్చారన్నారు. మైసరా రాజకీయ ధ్యాసతో వెళ్లారో, మరో కారణంతో వెళ్లారో చూస్తాంగా అన్నారు. మైసూరాను జగన్ ఎప్పుడైనా డబ్బులు అడిగారా అని మండిపడ్డారు. మైసూరాకు మైనింగ్ కంపెనీలు, తదితరాలు ఉన్నాయని, అందుకే ఆయన టిడిపిలోకి వెళ్తున్నారని నేను అంటున్నానని చెప్పారు.
అందుకే టిడిపిలోకి..
మైసూరా రెడ్డి సిమెంట్ కంపెనీలకు మైనింగ్ లీజులు, బ్యాంకులకు హామీలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినందునే మైసూరా ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఆయన గత ఆరు నెలలుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.