విశాఖకు తరలింపు ముహూర్తం?- వైఎస్ జగన్ను కలిసిన శారదాపీఠం ఉత్తరాధికారి..!!
అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అధికార వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది. ఒకవంక కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తూనే మరోవంక- నిర్మాణాలకూ పూనుకుంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో నిర్మిస్తోంది. ప్రస్తుతం రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ఉన్న ఈ కేంద్ర కార్యాలయాన్ని త్వరలో విశాఖపట్నానికి తరలించబోతోంది. ఎండాడ పనోరమా హిల్స్లో వైసీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మితం కానుంది.

తరలింపు వేళ..
దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భూమిపూజ చేశారు. కొత్త సంవత్సరంలో విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు కాబోతోందనీ తేల్చి చెప్పారు. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న తరువాత.. దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టలే అవకాశాలు లేకపోలేదు.

జగన్ను కలిసిన స్వాత్మానందేంద్ర స్వామి
ఈ పరిణామాల మధ్య తాజాగా- విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. జగన్కు శాలువ కప్పారు. శారదాంబ అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. విశాఖ శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ఆయనకు అందజేశారు. ఈ మహోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు.

జనవరి 27 నుంచి..
వచ్చే జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖపట్నం పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలో ఈ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా యజ్ఞయాగాదులను నిర్వహిస్తుంటారు ఇక్కడ. ఈ ఏడాది కూడా వార్షికోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో పనులు మొదలయ్యాయి.

వచ్చే ఏడాది కూడా..
పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా యజ్ఞయాగాదులు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 తేదీన ఈ పీఠం వార్షికోత్సవాల చివరి రోజు భారీగా నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరైన విషయం తెలిసిందే. రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. రుద్ర హోమం పూర్ణాహుతికి హాజరయ్యారు. వచ్చే సంవత్సరం నిర్వహించే ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది.
తరలింపునకు ముహూర్తం..
కొత్త సంవత్సరంలో విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న నేపథ్యంలో- దీనికి అవసరమైన ముహూర్తాన్ని ఖరారు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో సన్నిహిత సంబంధాలు ఉన్నందున వైఎస్ జగన్- విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి ముహూర్తాన్ని అడిగి తెలుసుకోవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications