సీఆర్డీఏ వద్ద ఉద్రిక్తత.. బలవంతపు భూసేకరణపై తిరగబడ్డ రైతులు!
రాజధానికి భూములు ఇచ్చేందుకు గతంలో తాము నిరాకరించడంతో.. బలవంతంగా భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ పెనుమాక రైతులంతా సీర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఆర్డీఏ ముందు కూరగాయలు పారబోసి రైతులు తమ నిరసన తెలిపారు.
భూసేకరణను వ్యతిరేకిస్తూ సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రం అందజేయడానికి వారు ప్రయత్నించారు. అయితే పోలీసులు అందుకు అడ్డు చెప్పడంతో.. రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాజధానికి భూములు ఇచ్చేందుకు గతంలో తాము నిరాకరించడంతో.. బలవంతంగా భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు.
కాగా, గత సంవత్సరం పెనుమాకతో పాటు మరో రెండు గ్రామాల్లో భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో.. అక్కడి రైతులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా వారికి మద్దతుగా నిలవడంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించింది. అయితే తాజాగా భూసేకరణ నిమిత్తం మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రైతులంతా ఆందోళన బాట పట్టారు.
ఇదిలా ఉంటే, రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దంటూ.. ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్పై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నదాతల అభ్యంతరాలకు పరిష్కారం చూపించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో మొండిగా ముందుకు వెళ్లాలనుకున్న ప్రభుత్వానికి బ్రేకులు పడ్డట్లయింది.
దుగ్గిరాల మార్కెట్ వద్ద ఆందోళన:
గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు యార్డు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. గ్రేడింగ్ పేరుతో అధికారులు కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు భవనం ఎక్కి మరీ దూకుతామని బెదిరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.