చంద్రబాబు ఖాళీ చేతులు ఊపుతున్నారు: జగన్
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దివంగతన నేత వైయస్ రాజశేఖర రెడ్డి చాటి చెప్తే, చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి వద్దని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
శనివారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పైడిభీమవరంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేశారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ చేయలేదని ఆయన అన్నారు.
బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబుకు ఓటేయాలన్నారని, అధికారంలోకి వచ్చాక హామీలన్నీ మరిచిపోయారని ఆయన అన్నారు. చంద్రబాబు అంతటి మోసగాడు దేశంలోనే లేడనే మాట ప్రతి రైతు నోటి వెంట వినిపిస్తోందని ఆయన అన్నారు.
డ్వాక్రా అకాచెల్లెమ్మలను అడిగితే తమ జీవితంలో ఇంతటి అన్యాయస్తుడిని చూడలేదని అంటున్నారని, ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని టీడీపివాళ్లు టీవీల్లో ప్రచారం చేశారని ఆయన చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త జాబులు రాకపోగా ఉన్న జాబులు ఊడగొడుతున్నారని జగన్ దుయ్యబట్టారు.
నిరుద్యోగ భృతి ఏదని అడిగితే చంద్రబాబు ఖాళీ చేతులు ఊపుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు పరిపాలన గురించి మూడు మాటల్లో చెప్పాలంటే మోసం, మోసం, మోసంలా ఉందని అన్నారు.