ప్రత్యేక హోదా ఎవరబ్బ సొమ్ము కాదు:ప్రజానటుడు ఆర్.నారాయణమూర్తి
పశ్చిమగోదావరి జిల్లా: ప్రత్యేక హోదా అనేది ఎవరబ్బ సొమ్ము కాదని...ఇచ్చి తీరాల్సిందేనని ప్రముఖ ప్రజానటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వచ్చిన నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు.
తిరుపతిలో వెంకన్న సాక్షిగా నరేంద్రమోది ప్రత్యేక హోదా ప్రకటన చేశారని, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. "విభజిత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కూడా భారీ లోటుతో కొనసాగుతోంది...ఇలాంటి సమయంలో కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా సాకులు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతోంది...ఈ హోదా అనేది ఎవరబ్బ సొమ్ము కాదు...ఇచ్చి తీరాల్సిందే"...అని ప్రజానటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు.

ఒక హామీ ఇచ్చిన తరువాత దాని మీద నిలబడటం ధర్మమని, అయితే ఆ తరువాత ప్యాకేజీ అంటూ మాట మార్చారని, కనీసం విలువలకు కూడా నిలబడలేదని ఆర్.నారాయణమూర్తి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి అడగాలా, ఇది చాలా దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో ఉన్న మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని ఆర్.నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో కూడా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆర్.నారాయణమూర్తి విమర్శించారు. తెలంగాణలో పద్మ అవార్డులకు అర్హులైన వారు ఒక్కరూ లేరా...ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క శ్రీకాంత్ మాత్రమే కనిపించాడా అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని, ఆయన ప్రపంచంలో గొప్పనటుడు కాదా అని ఆర్.నారాయణమూర్తి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications