బాధితుల ఆకలి కేకలు, కేబినెట్ అక్కడే - వైఫల్యం ఎక్కడ..!!
విజయవాడలో బాధితుల ఆర్తనాదాలు ఎవరికీ పట్టటం లేదు. కొన్ని ప్రాంతాలకే సాయం పరిమితం అవుతోంది. సహాయం అందక..వరద తగ్గక విజయవాడ ప్రజలు నగరం వీడుతున్నారు. సహాయం మారూమూల ప్రాంతాలకు అందటం లేదు. ట్యూబులు, థర్మోకోల్ షీట్లే పడవలుగా మర్చుకుంటున్నారు. అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బుడమేరు బాధితుల్లో తీవ్ర ఆవేదన, ఆక్రోశం పెరుగుతోంది. ఎక్కడ వైఫల్యం అయ్యారు..ఏం జరుగుతోంది.
దొరకని ఉపశమనం
విజయవాడ నగర ప్రజలు వణికిపోతున్నారు. వరద ముంపులో వారికి సాయం అందటం లేదు. కొన్ని ప్రాంతాలకే సహాయక చర్యలు పరిమితం అవుతున్నాయి. వరద వచ్చి నాలుగో రోజు అయినా సహాయక చర్యల వేగం పెరగగలేదు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్లు మూగనోము పట్టాయి. ఏరియాల వారీగా పర్యవేక్షకులను నియమించారని తెలుసుకుని ఫోన్లు చేస్తే స్విచ్చాఫ్ వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగినా... మంత్రులంతా నీళ్లలో ఉన్నా బాధితులకు ఉపశమనం లభించడం లేదు. వరద నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడంలో వేగం మందగించింది.

అందని సాయం
విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 15 డివిజన్లు బుడమేరు వరదలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారి నుంచి బాగా లోపలున్న వారికి సాయం అందలేదు. మొదటి అంతస్తు దాటి పైన ఉన్న వారికి ఇళ్లలో అన్నీ ఉన్నా నీళ్లు లేవు. పాలు లేవు. కరెంటు లేదు. మూడు రోజులుగా ఆహారం, నీరు లేక నీరసించడంతో బతుకు కాపాడుకునేందుకు... ప్రాణాలకు తెగించి వరద బాధితులే వరద నీళ్లలో బయటకు వచ్చారు. మెడలోతు, నడుములోతున్న నీళ్లలో కర్రలు ఆసరాగా చేసుకుని, ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఒడ్డుకు చేరుతున్న వారు కోకొల్లలుగా కనిపించారు.
బాధితుల ఆక్రోశం
వరద ముంపులో చిక్కుకున్న ప్రాంతంలో 30 శాతం ప్రాంతానికి మాత్రమే ఆహారం, మంచినీళ్లు అందించినట్లు అంచనా. ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న వారిని మినహాయిస్తే... లోపలున్న వారికి గత మూడు రోజులుగా ఆహారం అందలేదు. కనీసం మంచినీళ్లు కూడా అందలేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆహారాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. ఆహారం పాడైపోతోందని, బాధితులకు పంచాలని ఇక్కడి అధికారులకు ఆయా జిల్లాల అధికారులు ఫోన్ చేసినా స్పందన కనిపించడంలేదు. కీలకమైన సమయంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పనితీరు మొక్కుబడిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications