పురంధేశ్వరికి ఓటేయాలన్న బాబు: వేదికపై ఇద్దరు
చిత్తూరు: భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంటు అభ్యర్థిని పురంధేశ్వరికి ఓటేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోరారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో గురువారం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభలో ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్రలో టిడిపి-బిజెపి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుతోపాటు పురంధేశ్వరి కూడా వేదికను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరయ్యారు.
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బినామీ అని చంద్రబాబు ఆరోపించారు. సాక్షి పత్రిక తనపై అనుచిత విమర్శలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ పార్టీది అయితే.. అందులో కీలక భాగస్వామ్యం జగన్మోహన్ రెడ్డిదేనని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి వేసినట్లేనని చంద్రబాబు అన్నారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో దేశంలో ఎవరూ ఖర్చు చేయలేనంత సొమ్మును ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ కూడా అవినీతి కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తానని చెబుతున్నాడని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే తమ పార్టీకే ఓటేయాలని చంద్రబాబు ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ నాయకుడేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సమర్థ నాయకుడన్న ఆయన, మోడీనే ప్రధాని కావాలని ఆకాంక్షించారు. రాయలసీమ రతనాల సీమ కావాలంటే నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి మోడీ సహకరిస్తామన్నారని చంద్రబాబు తెలిపారు. అవినీతి పాలన అంతం కావాలంటే నరేంద్ర మోడీ ప్రధాని కావాలని, తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని కావాలని చంద్రబాబు అన్నారు. సీమాంధ్రలకు అన్యాయం చేసినవారి గుండెల్లో నిద్రపోయేందుకు పవన్ తమతో కలిసి వస్తున్నారని చంద్రబాబు తెలిపారు.