'షర్మిలను వదిలేసినట్లు జగన్నూ, వైయస్ వ్యతిరేకులే..'
హైదరాబాద్: తన సోదరి షర్మిలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వదిలేసినట్లుగానే ఆయనను రాష్ట్ర ప్రజలు రేపు వదిలేస్తారని, ఒక్కసారిగా తెలంగాణలో పార్టీని వదిలేసుకున్న అతనికి వ్యక్తిగత స్వార్థమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఆదివారం ధ్వజమెత్తారు.
షర్మిల జగన్ వదిలేసిన బాణమా? అని ప్రశ్నించారు. చెల్లెలు షర్మిల, బాబాయి సుబ్బారెడ్డిలను జగన్ వదిలేసినట్లుగా ప్రజలు కూడా ఆయనను వదిలేయక తప్పదన్నారు. తెలంగాణను అతను ఒక్కసారిగా వదిలేశారన్నారు. జగన్ పర్యటన సమైక్యం కోసం కాదని విమర్శించారు. అందర్ని, అన్నింటిని వదిలేసుకునే జగన్కు స్వార్థమే ముఖ్యమని ఆరోపించారు.

జాతీయ నాయకులను కలుస్తున్న జగన్ ఒక్కో పార్టీ నేత దగ్గర ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని, కేసుల నుండి విముక్తి కోసమే విపక్షాల సాయం కోరుతున్నారని ఆరోపించారు. వామపక్షాల నేతలను కలిసి తన వద్దకు రావొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ మమతా బెనర్జీ చెప్పినట్లుగా తమకు సమాచారముందన్నారు.
జగన్ జాతీయ నాయకులను కలుస్తోంది సమైక్యం కోసం కాదన్నారు. సమైక్యం ముసుగులో విభజన కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖ ద్వారా ఆయన విభజన వాదం అర్థమవుతోందన్నారు. శీతాకాల సమావేశాలు జరగకూడదనే సోనియా ఆదేశాల మేరకు జగన్ సమైక్య యాత్ర చేస్తున్నారని ఆరోపించారు.
వైయస్ రాజశేఖర రెడ్డికి ఆప్తమిత్రలు జగన్కు ఇప్పుడు దూరంగా ఉంటున్నారని, ఆయనను విమర్శించిన వారు ఇప్పుడు దగ్గరయ్యారని చెప్పారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు తల్లి, చెల్లి బాధ్యతనంతా నెత్తిన వేసుకున్నారని, అప్పట్లో షర్మిల తాను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పారని, ఇప్పుడు జగన్ వదిలేసిన బాణంలా బెంగళూరులో ఉన్నారని ఎద్దేవా చేశారు. బంధువులకే ఏమీ చేయని జగన్ ప్రజలకు ఏం చేస్తారన్నారు.












Click it and Unblock the Notifications