రాజధాని అమరావతిపై అసెంబ్లీలో..!!
అమరావతి: రాజధాని అమరావతిపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ సాగింది. పలువురు మంత్రులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అమరావతి ప్రాంతంలో సంభవించిన అక్రమాలు, అవినీతిపై మాట్లాడారు.
రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి కథల్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కూడా ఉందని, దోపిడీకి దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్ రోడ్డు స్కామ్కు పాల్పడినట్లు విమర్శించారు.

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వ్యవహారం కేబినెట్ నిర్ణయం అంటూ చంద్రబాబు తప్పించుకోవడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు. మాస్టర్ ప్లాన్ పేరుతో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా ప్లాన్లో మార్పులు చేర్పులు చేశారని అన్నారు.
లింగమనేని రమేష్, హెరిటేజ్ సంస్థ, నారాయణ కాలేజీల కోసం ప్లాన్ను మార్చారని పేర్ని నాని ఆరోపించారు. ఏ14గా ఉన్న మాజీ మంత్రి నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్తో తనకేం సంబంధం అని ఢిల్లీలో చెప్పాడని, 2008- 2017 మధ్యకాలంలో ఆ సంస్థకు డైరెక్టర్గా ఉన్నాడని గుర్తు చేశారు. హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్గా నారా లోకేష్ ఉన్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
చంద్రబాబు, అప్పటి మంత్రి పొంగూరు నారాయణ.. దళితులు, పేదల నుంచి అసైన్డ్ భూములను లాక్కున్నారని, ఇది చట్టం ప్రకారం సాధ్యం కాదని చెప్పినా వినలేదని, న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసీ జీవో 41ను విడుదల చేశారని అన్నారు. ఇంతా చేసి తనకు ఏం సంబంధం అని నారా లోకేష్ చెబుతున్నాడని, అలాంటప్పుడు ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications