టెక్కీనని చెప్పి పెళ్లి పేరుతో 30 మందికి టోకరా (ఫొటో)
హైదరాబాద్: పెళ్లి పేరుతో 30 మంది అమ్మాయిలను మోసగించి, సొత్తు కాజేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మరో 700 మంది అమ్మాయిలకు ప్రతిపాదనలు పంపించాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి మంగళవారంనాడు అతన్ని అరెస్టు చేశారు. క్రైమ్ అదనపు డిసిపి బి. శ్రీనివాస రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన పానటి శశికుమార్ (24) బిటెక్ చదువు మధ్యలోనే అపేసి జులాయిగా తిరుగుతున్నాడు. తల్లిదండ్రులు సోదరుడితో కలిసి కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉంటున్నారు. షాది డాట్ కామ్, భారత్ మ్యాట్రిమోనీ, తెలుగు మ్యాట్రిమోని తదితర వెబ్సైట్లలో పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలతో, విడాకులు పొందిన మహిళలతో ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.
పెళ్లి చేసుకుంటానని నేరుగా వారింటికి వెళ్లాడు. తాను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానని, తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటున్నారని కొన్ని నకిలీ ఫొటోలు చూసి నమ్మిస్తాడు. తర్వాత అమ్మాయితో తిరుగుతాడు. బంగారు నగలు, ల్యాప్టాప్, నగదు వంటివి తెలివిగా తీసుకుంటాడు.

ఆ తర్వాత పథకం ప్రకారం గొడవ పెట్టుకుని కనిపించకుండా పోతాడు. హైదరాబాద్, బెంగళూరులకు చెందిన 30 మందిని ఇలా మోసం చేశాడు. ఇదే క్రమంలో జల్పల్లికి చెందిన ఓ యువతిని మోసగించాడు. ఆమె సోదరికి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 1.50 లక్షల రూపాయలు తీసుకుని టోకరా ఇచ్చాడు.
దాంతో అక్కాచెల్లెళ్లు ఆగస్టులో సైబర్ క్రైమ్ ఎసిపి ఎస్ జయరాంకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల పాటు కేసును దర్యాప్తు చేసిన ఇన్స్పెకర్ ఎస్ రాజశేఖర రెడ్డి ఎట్టకేలకు నిందితుడి ఆచూకీ కనుక్కున్నారు. ఎస్ఐ విజయ్ వర్ధన్తో కలిసి నిందితుడిని పథకం ప్రకారం హైదరాబాద్ రప్పించి, పట్టుకున్నారు.
బెంగళూరులో విడాకులు పొందిన ఓ మహిళను కూడా పెళ్లి చేసుకుంటాని నమ్మించి 3 లక్షల రూపాయల విలువైన నగలును దొంగిలించాడు. ఓ మహిళా జర్నలిస్టు కూడా ఇతని చేతిలో మోసపోయింది. బెంగళూరులో ఇతనిపై పలు కేసులున్నాయి. నిందితుడు పట్టుబడడం మాత్రం ఇదే తొలిసారి. అతనికి సహకరించిన సోదరుడు శివకుమార్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. శశికుమార్ అరెస్టు గురించి హైదరాబాద్ పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications