ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరం, విచారణ జరిపించాలని కోరాం: బాబు, కెసిఆర్పై నిప్పులు
న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని, దానిపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఢిల్లీలో బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తదితరులను కలిశారు. ఆ తర్వాత బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఫోన్లను ట్యాప్ చేశారని, అందుకు అక్రమ పరికరాలను వాడారని, వీటిపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని ఆయన వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు నిజాయితీగా అమలు కావాలని, శాంతిభద్రతలు గవర్నర్ చేతుల్లో ఉండాలని ఆయన అన్నారు. సెక్షన్ 8 ప్రకారం హైదరాబాదులో అధికారం గవర్నర్దేనని, మొదటి సంవత్సరం అది సరిగా అమలు కాలేదని ఆయన అన్నారు. స్టింగ్ ఆపరేషన్ చేసి ఎసిబి చేసినట్లుగా చెప్పారని, ఎసిబి చేస్తే కోర్టులో ఉండాలి లేదా ఎసిబి వద్ద ఉండాలి గానీ న్యూస్ చానెల్స్కు ఎలా వచ్చాయని ఆయన అన్నారు. ఈ విషయంపై ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 10, 9 అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తమ శాసనసభ్యులను ప్రలోభ పెట్టిందని ఆయన ఆరోపించారు. గవర్నర్కు కూడా తెలుపకుండా తమ శాసనసభ్యుడితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ హై హ్యాండెడ్గా వ్యవహరించిందని, ఇది బాధాకరమని అన్నారు. కెసిఆర్ వ్యక్తిగతంగా, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అవినీతి, కుట్ర రాజకీయాలు కెసిఆర్, జగన్, కాంగ్రెసు కలిసినట్లు ఇంతకు ముందే చెప్పానని ఆయన అన్నారు.
హైదరాబాదులో ఆంధ్రవాళ్ల ఇళ్లను కూలగొట్టారని, అధికారులను వేధిస్తున్నారని, వరుస సంఘటనలు జరుగుతున్నాయని, సయోధ్య పాటిద్దామని చెప్పినా టిఆర్ఎస్ వినలేదని ఆయన అన్నారు. సమస్యలను సయోధ్యతో పరిష్కారిద్దామని తాను చెప్పానని, కానీ కలిసి కూర్చునే పరిస్థితి లేదని ఆయన అన్నారు.
సిగ్గు లేదు, నువ్వు అవినీతి గురించి మాట్లాడుతావా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు అన్నారు. తెలుగువాళ్లం సయోధ్యతో మెలగాలని ప్రయత్నాలు చేశామని, కానీ దాన్ని ఆసరా తీసుకుని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి వచ్చారని ఆయన అన్నారు. ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రవర్తించాలని, దాన్ని టిఆర్ఎస్ ఉల్లంఘించిందని ఆయన అన్నారు.
ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడానికి తానే ముందుకు వచ్చానని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. 63 మంది శాసనసభ్యులు ఉంటే 5గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎలా నిలబెడతావని ఆయన అడిగారు. టిఆర్ఎస్ మూడు సీట్లను గెలుచుకోగలదని, ఇతర పార్టీలు మద్దతు ఇస్తే బొటాబోటీగా నాలుగో సీటు గెలుచుకోగలదని, కానీ ఐదుగురిని పోటీకి పెట్టి టిఆర్ఎస్ శాసనసభ్యులను ప్రలోభపెట్టిందని ఆయన అన్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తే అన్నీ బయటకు వస్తాయని ఆయన అన్నారు
ఏ టీవీ చేసిందో ఆ టీవీ వాళ్లను అడుగు, ముఖ్యమంత్రిని అడిగే పద్ధతి ఇదేనా అని అన్నారు. బురద చల్లడానికే అంతా చేస్తున్నారని ఆయన అన్నారు. స్టీఫెన్ సన్తో మాట్లాడినట్లు లీకయిన ఆడియోలోని మాటలు మీవేనా అని అడిగితే చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహించారు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని అని, హైదరాబాదులో వాళ్లకు ఎంత అధికారం ఉందో, తనకు కూడా అంత అధికారం ఉందని ఆయన అన్నారు. తాను తెలంగాణ ప్రభుత్వానికి సబ్ సర్వెంట్ను కాదని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధాని కాబట్టి హైదరాబాదులో కాపురం పెట్టానని, తన పరిధిలోకి రావడానికి వారెవరని ఆయన అన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రెండు ప్రభుత్వాలు ఒక నగరంలో ఉన్నాయని, వాళ్ల పరిధిలో వాళ్లు ఉండాలని, తమ పరిధిలో తాము ఉండాలని, అందుకే సెక్షన్ 8 పెట్టారని ఆయన అన్నారు. దానికి గవర్నర్ బాధ్యత వహించాలి గానీ తెలంగాణ ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. స్టీఫెన్ సన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఏం చేశారు, ఎన్ని ఫోన్లు ట్యాప్ చేశారు, అన్నీ బయటకు వస్తాయని ఆయన అన్నారు. తమ శాసనసభ్యులను తీసుకోవడం, తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే అవినీతి కాదా, దాని గురించి నువ్వు అడిగావా అని ఓ మీడియా ప్రతినిధితో అన్నారు.
ఆడియోను తెలంగాణ ముఖ్యమంత్రి లీక్ చేశాడని, తన మీ ఆరోపణలు వచ్చాయని,త పద్ధతి లేకుండా చేశారని, తన పోన్లు ట్యాప్ చేశారని, ఇది దుర్మార్గమూ అనైతికమూ అని ఆయన అన్నారు. తమ వద్ద టేప్లున్నాయి, సాక్ష్యాలున్నాయని తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి అంటారని, అవి ఎక్కడివంటి కోర్టులో ఎస్టాబ్లిష్ చేస్తామంటారని ఆయన అన్నారు. టీ చానెల్ ఆడియో సంభాషణలను ప్రసారం చేసిందని, ఆ తర్వాత అన్ని చానెళ్లూ దాన్ని తీసుకున్నాయని, టీ చానెల్ కెసిఆర్దని, ఏదో ఘనకార్యం చేసినట్లు దాన్ని ప్రసారం చేశారని ఆయన అన్నారు. అవినీతి గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. తెలంగాణ ఎసిబికి ఆంధ్రతో సంబంధం లేదని ఆయన అన్నారు.