ఫోన్ ట్యాపింగ్పై ఎవరు?: టెలికం సంస్థల నుండి కూపీలాగుతున్నారు
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏయే ఫోన్లను ట్యాపింగ్ చేసిందనే వివరాలను ఏపీ ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిట్ 12 మంది టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పలువురు సర్వీస్ ప్రొవైడర్లు సోమవారం నాడు విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్లో హాజరయ్యారు. ఒక్కరొక్కరుగా ప్రొవైడర్లు వచ్చారు.
వొడాఫోన్, యునినార్, ఎయిర్ టెల్ తదితర సంస్థల ప్రతినిధులు హాజరైనట్లుగా తెలుస్తోంది. భవానీపురం పోలీసు స్టేషన్లో చిత్తూరు ఎస్పీ, ఏఎస్పీ నేతృత్వంలో సిట్ బృందం విచారణ జరుపుతోంది. సర్వీస్ ప్రొవైడర్ల నుండి వివరాలను సేకరిస్తోంది.
పలువురు ట్యాపింగ్కు సంబంధించిన వివరాలు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎవరు దరఖాస్తు చేశారు? ఎవరి నుండి ఆదేశాలు వచ్చాయి? ట్యాపింగ్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారా? తదితర అంశాలపై విచారిస్తున్నారు. ప్రతినిధులను ప్రశ్నించడం ద్వారా కూడా వివరాలను కూపీలాగుతున్నారు.
కాగా, పోలీసు స్టేషన్ వద్ద ఆంక్షలు విధించారు. ఫోన్ ట్యాపింగ్ పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఇచ్చిన ఫిర్యాదు పైన సిట్ విచారణ జరుపుతోంది. ప్రత్యేక దర్యాఫ్తు బృందానికి ఇక్బాల్ నేతృత్వం వహిస్తున్నారు. మరోవైపు జెరూసలేం మత్తయ్య ఫిర్యాదు పైన డీజీపీ రాముడు సమీక్ష నిర్వహించారు.