రివర్స్!: 'ఫోన్ ట్యాపింగ్ నిజం, కెసిఆర్ ప్రభుత్వం కూలడం ఖాయం'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇన్నాళ్లూ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని బుకాయిస్తూ వచ్చిందని, అది బూటకమని ఇప్పుడు మరింత స్పష్టంగా తేలిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం నాడు అన్నారు.
కర్నాటకలో రామకృష్ణ హెగ్డేకు పట్టిన గతే తెలంగాణ సీఎం కెసిఆర్కు పట్టడం ఖాయమన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఏపీని ఇబ్బందుల పాలు చేసేందుకు కుట్ర చేశారన్నారు. ఏపీ పైన తెలంగాణ సర్కారు కక్ష కట్టిందని చెప్పారు.
ఏపీ మంత్రులు, అదికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారన్న తమ అనుమానం నిజమని తేలిందన్నారు. ఏపీ సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ ప్రభుత్వం తన గొయ్యిని తానే తవ్వుకుందని మరో మంత్రి రావుల కిషోర్ బాబు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం త్వరలో కుప్పకూలడం ఖాయమని టిడిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూసి, ఫోన్ ట్యాపింగ్ చేసిన టిఆర్ఎస్ అడ్డంగా బుక్కయిందన్నారు.
ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ట్యాపింగ్ చేసినట్లు తమకు ఆధారాలు దొరికాయన్నారు. ఫోన్ ట్యాపింగులో తప్పు చేశామన్న భయంతో పెద్ద పెద్ద లాయర్లను రప్పించుకొని కోర్టులో వాదనలు వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరెత్తితేనే టిఆర్ఎస్ భయపడుతోందన్నారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ తప్పుకాదని, తెలంగాణ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు ఉందని తెలంగాణ తరఫు న్యాయవాది రామ్ జెత్మలాని చెప్పిన విషయం తెలిసిందే. కాల్ డేటా అడిగే హక్కు లేదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఫోన్ ట్యాపింగ్ చేయకుంటే కాల్ డేటా ఇవ్వవద్దని ఎందుకు చెబుతుందని ప్రశ్నిస్తున్నారు.