రాములమ్మ మిస్: టి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు ఈ నెల 9వ తేదీతో గడువు ముగుస్తుంది. అయినా అభ్యర్థులపై దాదాపు అన్ని పార్టీల్లోనూ అనిశ్చితి నెలకొంది.
అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ... తెలంగాణ రాష్ట్ర సమితి 73 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టింది. శనివారం రాత్రి కాంగ్రెస్ అధిష్ఠానం 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి హైడ్రామా చోటు చేసుకుంది.
జాబితా ప్రకటన ఆకస్మికంగా ఆగిపోయింది. 110 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం నిలిచిపోయింది. మెదక్ బరిలో విజయశాంతి పేరు మిస్ అయింది. ఆమె అసెంబ్లీకి పోటీ చేసే అవకాశముంది.
బలరాం నాయక్
బలరాం నాయక్ వరంగల్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం నుండి మరోసారి పోటీ చేయానున్నారు. ఆయన ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు.
జైపాల్ రెడ్డి
జైపాల్ రెడ్డి 2009 ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నుండి లోకసభకు పోటీ చేశారు. ఇప్పుడు ఆయన మహబూబ్ నగర్ నుండి పోటీ చేయనున్నారు. ఆయన ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు.
మధుయాష్కీ
మధుయాష్కీ మరోసారి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. ఆయన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి సన్నిహితులు. తెరాస నుండి యాష్కీ పైన కల్వకుంట్ల కవిత బరిలోకి దిగుతున్నారు.
నంది ఎల్లయ్య
సీనియర్ కాంగ్రెసు పార్టీ నాయకుడు నంది ఎల్లయ్య మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నుండి లోకసభకు పోటీ చేయనున్నారు.
అంజన్ కుమార్ యాదవ్
సికింద్రాబాదు నియోజకవర్గం నుండి రెండుసార్లు వరుసగా గెలుపొందిన అంజన్ కుమార్ యాదవ్ మరోసారి అదే స్థానం నుండి పోటీ చేయనున్నారు.
పొన్నం ప్రభాకర్
పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోకసభ స్థానం నుండి పోటీ చేయనున్నారు. ఆయన 2009లో ఇదే స్థానం నుండి పోటీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి నుండి బరిలోకి దిగుతున్నారు. 2009 ఎన్నికల్లో ఆయన అదే స్థానం నుండి పోటీ చేశారు. ఆయనకు టిక్కెట్ పైన అనుమానాలు తలెత్తాయి.
వివేక్
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కాకా తనయుడు జి వివేక్ మరోసారి పెద్దపల్లి బరిలో నిలవనున్నారు. తెలంగాణ కోసం ఆయన గతంలో తెరాసలో చేరినా.. ఇటీవలె మళ్లీ సొంత గూటికి వచ్చారు.
సర్వే సత్యనారాయణ
సర్వే సత్యనారాయణ మల్కాజిగిరి బరిలో దిగనున్నారు. ఆయన ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. 2009 ఎన్నికల్లోను ఆయన అదే స్థానం నుండి పోటీ చేశారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి
2009లో నల్గొండ లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి అక్కడి నుండే పోటీ చేయనున్నారు.
సిరిసిల్ల రాజయ్య
వరంగల్ జిల్లా ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య అదే నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. గతంలో ఆయన తెరాసలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది.
శ్రవణ్
సీనియర్ నేత శ్రవణ్ కుమార్ రెడ్డి మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయనున్నారు. 2009లో తెరాస తరఫున విజయశాంతి గెలుపొందారు. ఇప్పుడు ఆమె కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. అయితే, ఈ సీటు నుండే ఆమె పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ శ్రవణ్కు అవకాశం వచ్చింది. విజయశాంతి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశముంది.
కార్తీక్ రెడ్డి
మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి చేవెళ్ల లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
నరేష్ జాదవ్
అదిలాబాద్ లోకసభకు కాంగ్రెసు పార్టీ తరఫున నరేష్ జాదవ్ పోటీ చేయనున్నారు. చేవెళ్ల, అదిలాబాద్, మెదక్ వంటి స్థానాల్లో కాంగ్రెసు యువకులను నిలబెట్టింది.
సురేష్ షెట్కార్
మెదక్ జిల్లా జహీరాబాద్ లోకసభ స్థానానికి కాంగ్రెసు పార్టీ తరపున ఆ పార్టీ సీనియర్ నేత సురేష్ షెట్కార్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
సామ రామకృష్ణా రెడ్డి
మజ్లిస్(ఎంఐఎం) పార్టీకి పెట్టని కోట వంటి హైదరాబాదు లోకసభ స్థానానికి కాంగ్రెసు పార్టీ తరఫున సామ కృష్ణా రెడ్డి పోటీ చేయనున్నారు.