మెట్రో తంటా: కానిస్టేబుల్ దూకుడు, సిబ్బంది ధర్నా (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు పనులు సోమవారం ఉద్రిక్తతకు దారి తీశాయి. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మెట్రో రైలు పనులు చేస్తున్న సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. దీంతో మెట్రో రైలు సిబ్బంది రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
మెట్రోరైలు ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేపట్టడమే గాక, అన్ని విభాగాలను సమన్వయం చేసుకోవాలన్న చీఫ్ సెక్రటరీ ఆదేశాలను పలు విభాగాలు పట్టించుకోవటం లేదు. ఇందుకు నిదర్శనంగానే సోమవారం సికిందరాబాద్లో ఓ సంఘటన చోటు చేసుకుంది.
విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్యుత్సాహం కారణంగా మెట్రోరైలు స్థల సేకరణ వివాదాస్పదమైంది. స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మెట్రో పనులు
నగరంలో నిర్మితమవుతున్న మూడు మెట్రో కారిడార్లలో ఒకటైన సికిందరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సికిందరాబాద్ స్టేషన్, ముషీరాబాద్, చిక్కడపల్లి మీదుగా ఫలక్నుమా వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారిడార్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సికిందరాబాద్ గార్డెన్ హోటల్ స్థల సేకరణను అధికారులు సోమవారం ప్రారంభించారు.
ఊపందుకున్న పనులు
సోమవారం ఉదయం నుంచి ప్రారంభించిన పనులు మధ్యాహ్నం కల్లా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అటు వైఎంసిఏ, ఇటు సంగీత్ థియేటర్, సికిందరాబాద్ స్టేషన్ నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు చిక్కులు వచ్చి పడ్డాయి.
కానిస్టేబుల్ జోక్యం..
ట్రాఫిక్కు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సుబ్బారావు జోక్యం చేసుకుని ముందస్తు ఎలాంటి చర్యల్లేకుండా స్థల సేకరణ ఎలా చేపడుతున్నారని మెట్రో సిబ్బందిని ప్రశ్నించారు.
ఇరువర్గాల మధ్య వాగ్వివాదం
ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన కానిస్టేబుల్ మెట్రో సిబ్బంది ఒకరిపై చేయి చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా మెట్రో సిబ్బంది పనులను నిలిపివేసి గార్డెన్ హోటల్ ముందు ధర్నాకు దిగారు.
ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రం
మెట్రో పనులు చేస్తున్న సిబ్బంది దర్నాకు దిగడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది. సమాచారం తెలుసుకున్న మెట్రో ఉన్నతాధికారులు రంగంలో దిగి సిబ్బందితో చర్చలు జరిపి వారిని సముదాయించటంతో గొడవ సద్ధుమణిగింది.
గంట తర్వాత..
మెట్రో ఉన్నతాధికారుల జోక్యంతో సమస్య పరిష్కారమైంది. ఆ తర్వాత గంటకు సిబ్బంది మళ్లీ విధులు చేపట్టడంతో స్థల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది.