చంద్రబాబూ! ఇప్పుడేం చెబుతారు: పురంధేశ్వరి నిలదీత, మోడీకి జీవీఎల్ థ్యాంక్స్
అమరావతి: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు రెండు రోజుల ముందు దీనిని ప్రకటించారు. ప్రత్యేక హోదా సాధనా సమితి నేతచలసాని, బీజేపీ నేతలు పురంధేశ్వరి, జీవీఎల్ నర్సింహా రావు తదితరులు స్పందించారు.
వారి సహకారంతో సాధ్యం
విశాఖపట్నంకు రైల్వే జోన్ చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు అన్నారు. బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా థ్యాంక్స్ చెప్పారు. అమిత్ షా, పీయూష్ గోయల్ సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదన్నారు.
దశాబ్దాల తర్వాత నెరవేరిన ఉత్తరాంధ్రవాసుల కల
అవరోధాలు అధిగమించి రైల్వే జోన్ ఇచ్చాం
ఇది సంతోషకరమైన విషయమని పురంధేశ్వరి అన్నారు. పలు సాంకేతిక అవరోధాలను అధిగమించి రైల్వే జోన్ ఇచ్చామని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసరంగా బీజేపీ పైన దుమ్మెత్తి పోశాయన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని నిరూపించామని చెప్పారు. తమను ప్రశ్నిస్తున్న వారు ఇప్పుడేం సమాధానం చెబుతారని తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఉద్దేశించి నిలదీశారు.
దశాబ్దాల కల నెరవేరింది
విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసిందని, ఇది సంతోషకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ ప్రకటనతో దశాబ్దాలుగా ఉత్తరాంధ్రులు కోరుకున్న కల నెరవేరిందని చెప్పారు.