ప్రధానితో కలిసే సీఎం జగన్ - షెడ్యూల్ ఇలా : వేదికపై 11 మందికే - ఎవరెవరంటే..!!
ప్రధాని మోదీ కొద్ది గంటల్లో ఏపీకి రానున్నారు. ఆయన రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా స్వాగత ఏర్పాట్లు చేసింది. ఆయనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వెల్లడైంది. భీమవరంలో ఆయనతో పాటుగా వేదిక పంచుకొనే ముఖ్యుల జాబితా ఖరారైంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం చేరుకుంటారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు ముఖ్యమంత్రి బయలుదేరతారు. 10.10 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోనున్న ప్రధాని నరేంద్రమోదీకి.. స్వాగతం పలుకుతారు. 10.15 గంటలకు సీఎం గన్నవరం నుంచి భీమవరం బయలుదేరనున్నారు. ప్రధాని హెలికాప్టర్లో భీమవరం చేరుకోనున్నారు.

ప్రదాని - సీఎం షెడ్యూల్ ఇలా
10.50 గంటలకు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 30 అడుగులు అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు భీమవరం నుంచి సీఎం తిరుగుపయనం కానుండగా.. ప్రధాని 12.30 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి సీఎం జగన్ వీడ్కోలు పలుకుతారు. భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని వర్చువల్గా ఆవిష్కరిస్తారు. విగ్రహం వద్ద చుట్టూ ఫ్లెక్సీల్లో అల్లూరి చిత్రాలతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చిత్రాలను ఏర్పాటు చేశారు.

ప్రధానితో పాటుగా వేదిక పైన వీరే
విగ్రహావిష్కరణ తరువాత బహిరంగ సభ జరగనుంది. ఆ సమయంలో ప్రధాని ఆశీసునలయ్యే వేదిక పైన 11 మందికే అవకాశం దక్కనుంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి జాబితా అందించింది. అందులో ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి .కిషన్రెడ్డితోపాటు మరో ఏడుగురే ఉంటారని అధికారులు తెలిపారు. ఉదయం 10.50 నుంచి 12.30 మధ్య ప్రసంగాలు ఉంటాయి. వర్షం కురిసినా తట్టుకునేలా షామియానాలతోపాటు.. ఎండ తీవ్రత పెరిగినా ఇబ్బంది లేకుండా కూలర్లు ఏర్పాటు చేశారు. వేదిక ఎదురుగా 50వేల మందికి కుర్చీలను సిద్ధం చేశారు. అల్లూరి కుటుంబీకులు ఆసీనులయ్యేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. రెండో వేదికపై ప్రజాప్రతినిధులు, వీఐపీలు ఆశీనులవుతారు. మూడో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

భారీ వర్షం - భారీగా ఏర్పాట్లు
సభా ప్రాంగణంలో భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణంలో ఎక్కడిక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన పరిస్థితి చక్కదిద్దే చర్యలు చేపట్టింది. నిలిచిన నీటిని మోటార్లతో తోడించడంతోపాటు.. లోతట్టు ప్రాంతాల్లో మట్టి పోశారు. బహిరంగ సభ చుట్టుపక్కల ప్రాంతాలు బురదమయం అయినా సాయంత్రానికి వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. అల్లూరి సీతారామరాజు సోదరుడి మనవడు శ్రీరామరాజు, అల్లూరి సైన్యంలో కీలక పాత్ర వహించిన మల్లుదొర కుమారుడు బోడి దొరలను వేదికపై ప్రధాని మోదీ సత్కరించనున్నారు. అల్లూరి రక్త సంబంధీకులు, మన్యం పితూరీ సైన్యంలో కీలక పాత్ర వహించిన వ్యక్తుల బంధువులను అల్లూరి ఉత్సవాలకు భీమవరం రప్పించారు. వారితో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications