తెలుగు రాష్ట్రాలపై లోక్ సభలో ప్రధాని ప్రస్తావన..!!
దేశం మొత్తం చూపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపైనే ఉంది. ఈ సమావేశాల ప్రారంభం రోజు ప్రధాని మోదీ పార్లమెంట్ బయటా...లోపల కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఇదే సమయంలో లోక్ సభ లో చేసిన ప్రసంగంలో ఏపీ రాష్ట్ర విభజన..తెలంగాణ ఏర్పాటు అంశాన్ని మరోసారి ప్రధాని ప్రస్తావించారు. ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ పురోగతికి సహకరిస్తున్నట్లు వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రత్యేక సెషన్ కాలవ్యవధి తక్కువే కావచ్చు కానీ సందర్భానుసారంగా పెద్దదని చెప్పారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్ ఆశాకిరణంగా మారిందని చెప్పారు. భారత ఉజ్వల భవిష్యత్తుకు జీ20 సదస్సు మార్గదర్శనం చేసిందన్నారు. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. ఆ తరువాత లోక్ సభలో ప్రస్తుత భవనంలో ఈ రోజుతో సమావేశాలు ముగియనుంది కీలక ఘట్టాలను ప్రధాని ప్రస్తావించారు.

లోకసభలో ప్రధాని తన ప్రసంగంలో మూడు రాష్ట్రాల విభజన అంశాన్ని ప్రస్తావించారు. చత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఏర్పాటు సమయంలో విడిపోయిన రాష్ట్రాలు..అదే విధంగా కొత్తగా ఏర్పాటు అయిన రాష్ట్రాల్లోనూ సంబరాలు చేసుకున్నారని ప్రధాని గుర్తు చేసారు. ఏ ఒక్కరికీ నష్టం లేకుండా విభజన ప్రక్రియ జరిగిందని వివరించారు. అందుకు ఇదే పార్లమెంట్ వేదికగా నిలిచిందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో యూపీఏ వ్యవహరించిన తీరు కారణంగా అటు తెలంగాణ..ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతంలోనూ సంబరాలు జరగలేదని కాంగ్రెస్ ను ఎద్దేవా చేసారు. వాజ్ పేయ్ ప్రభుత్వం నాడు అన్ని ప్రాంతాలకు ఆమోద యోగ్యంగా రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసారని చెప్పుకొచ్చారు.
చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నెహ్రు, అంబేద్కర్ నడయాడిన సభగా గుర్తుచేసారు. నెహ్రు నుంచి మన్మోహన్ సింగ్ వరకూ ఎందరో ప్రధానులు సమావేశాలకు నాయకత్వం వహించారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మన హీరోలను గుర్తు చేసుకోవాల్సిన సమయమని పేర్కొన్నారు. ఈ 75ఏళ్లలో 7500 మంది ఎంపీలు, 17 మంది స్పీకర్లు పనిచేశారని ప్రధాని వివరించారు. ఈ పార్లమెంట్ భవనం మనల్ని ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుందన్నారు. మనం కొత్త భవనంలోకి వెళ్తునప్పటికీ పాత భవనం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని చెప్పుకొచ్చారు. భారత్ అభివృద్ధి ప్రపంచమంతా ప్రకాశిస్తోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications