మోడీ రోడ్ మ్యాప్ వృథా ? తన దారి చూసుకుంటున్న పవన్ ! టీడీపీతో పొత్తుకు అడుగే దూరం !
గతేడాది పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ తర్వాత చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో చంద్రబాబు విజయవాడలో ఆయన్ను పరామర్శించారు. వైజాగ్ లో వైసీపీ మంత్రుల్ని జనసేన కార్యకర్తలు ఘోరావ్ చేసిన ఘటనల నేపథ్యంలో పవన్ పై ఆంక్షలు విధించిన పోలీసుల తీరుపై ఇద్దరు నేతలు విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అప్రమత్తమైన ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ను వైజాగ్ లో పిలిపించుకుని రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత సైలెంట్ గా ఉంటున్న పవన్.. ఇప్పుడు కుప్పంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును హైదరాబాద్ ఇంటికి వెళ్లి పవన్ పరామర్శించారు. దీంతో పవన్ కు ప్రధాని మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ వృథా అయినట్లే కనిపిస్తోంది.

వైజాగ్ టర్నింగ్ పాయింట్
వైజాగ్ లో వికేంద్రీకరణ గర్జన పెట్టిన వైసీపీ మంత్రులు.. ఎయిర్ పోర్టుకు తిరిగి వెళ్తున్న క్రమంలో జనసేన కార్యకర్తలు వారిపై దాడులకు దిగేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని జనసేన నేతల్ని అరెస్టు చేసి కేసులు పెట్టారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పైనా ఆంక్షలు పెట్టి ఆయన్ను హోటల్ నుంచి కదలనీయకుండా చేశారు. దీంతో వైజాగ్ లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. జనసేన కార్యకర్తలు హోటల్ దగ్గర గుమికూడటంతో పరిస్ధితులు మరింత దిగజారేలా కనిపించాయి. చివరికి పవన్ ఇక లాభం లేదనుకుని విజయవాడ వెళ్లిపోయారు.
అనంతరం ఆయన్ను చంద్రబాబు వచ్చి మూడున్నరేళ్ల గ్యాప్ తర్వాత పలకరించారు. దీంతో వీరిద్దరి బంధం తిరిగి మొదలయ్యేందుకు తొలి అడుగు పడింది.

పవన్ కు మోడీ రోడ్ మ్యాప్
వైజాగ్ పరిణామాల తర్వాత పవన్-చంద్రబాబు భేటీ కావడంతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానానికి ఈ విషయం చెప్పింది. దీంతో ఏపీలో భవిష్యత్ రాజకీయాల్ని దృష్టిలో ఉంచుకుని వైజాగ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయనకు రోడ్ మ్యాప్ నిర్దేశించారు. దీని ప్రకారం టీడీపీ లేకుండా బీజేపీ-జనసేన మాత్రమే ముందుకెళ్లేలా నిర్దేశించినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్ కూడా కాస్త అసంతృప్తిగా కనిపించారు. దీని ప్రభావంతో పవన్ ఆ తర్వాత చంద్రబాబు గురించి కానీ, టీడీపీ గురించి కానీ ఎక్కడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. దీంతో మోడీ రోడ్ మ్యాప్ వర్కవుట్ అవుతుందని కూడా అంతా భావించారు. కానీ మళ్లీ సీన్ రివర్స్ అయింది.

చంద్రబాబు కుప్పం టూర్ మరో టర్నింగ్
మోడీ రోడ్ మ్యాప్ ప్రకారం పవన్ తన రాజకీయాలు తాను చేసుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు కుప్పం టూర్ కు వెళ్లారు. అప్పటికే కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలతో విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబును కట్టడి చేసేందుకు వైసీపీ సర్కార్ జీవో నంబర్ 1 తీసుకొచ్చింది. దీంతో రోడ్లపై ఎలాంటి సభలు, రోడ్ షోలు పెట్టడానికి వీల్లేదని ఆయన్ను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే వెనక్కి తగ్గని చంద్రబాబు.. తన బస్సుపైకి ఎక్కి ప్రసంగించారు. రోడ్లపై ధర్నాలకు కూడా దిగారు. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇది మరో టర్నింగ్ పాయింట్ కు దారి తీసింది.

మళ్లీ పవన్-చంద్రబాబు భేటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నిన్న హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికెళ్లి భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చించారు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ఇద్దరినీ టార్గెట్ చేస్తూ అణచివేస్తున్న తీరుపై చర్చించుకున్నారు. ఇలాగే విడివిడిగా ఉండిపోతే వైసీపీ ప్రభుత్వం మరింతగా టార్గెట్ చేయడం ఖాయమనే నిర్ణయానికి వీరిద్దరూ వచ్చేశారు. దాని కంటే పొత్తు పెట్టేసుకోవడమే బెటర్ అనే ఆలోచనకు దాదాపుగా వచ్చేశారు. దీంతో టీడీపీ అనుకూల మీడియాలోనూ ఇవాళ దీనికి అనుకూలంగానే వార్తలు కనిపించాయి. దీంతో పాటు రాష్ట్రంలో సీట్ల పంపకాలపైనా ఇరు పార్టీలమధ్య ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

త్వరలో టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన ?
ప్రధాని మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం కనీసం ఎన్నికల వరకైనా రాష్ట్రంలో విడివిడిగా రాజకీయాలు చేసుకోవాలని భావించిన పవన్, చంద్రబాబు ఇప్పుడు వైసీపీ నుంచి ఎదురవుతున్న దాడుల నేపథ్యంలో పొత్తుకు సిద్ధమైపోయారు. తాజాగా హైదరాబాద్ భేటీలో ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. వీటిపై అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి. అలాగే రాష్ట్రంలో సీట్ల పంపకాలతో పాటు అధికార భాగస్వామ్యంపైనా ఈసారి క్లారిటీ వచ్చేయడం ఖాయంగా తెలుస్తోంది. దీంతో ఈ పొత్తు ప్రకటన కోసం వైసీపీ కూడా ఎదురుచూస్తోంది. ఓసారి ప్రకటన వచ్చాక వైసీపీ ఎదురుదాడి మరింత తీవ్రం కావడం ఖాయం. అప్పుడు జనం ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపై ఎన్నికల ఏడాది వాతావరణం డిసైడ్ కానుంది.












Click it and Unblock the Notifications