సీమలో కరువు.. కోస్తాలో వరదలు: చంద్రబాబు ఏరియల్ సర్వే, నిలిచిన పోలవరం పనులు
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమలో కరువు పరిస్థితులుండగా, కోస్తాంధ్ర ప్రాంతంలో విపరీతమైన వర్షాపాతం నమోదవుతోందని చెప్పారు.
పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీమలో కరువు.. కోస్తాలో వర్షాలు
ఈ సందర్భంగా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. రాయలసీమలో కరువు పరిస్థితులు ఉండగా.. కోస్తాలో భారీ వర్షాలతో వరదలు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కరువు ఉందని, గోదావరి నుంచి 1500టీఎంసీలు సముద్రం పాలయ్యాయని చెప్పారు.
రూ.600కోట్ల నష్టం
తూర్పుగోదావరి జిల్లాలోని 45గ్రామాలకు వరద తాకిడి ఎక్కువగా ఉందని, బాధితుల కోసం 16పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పారు. భారీ వర్షాల కారణంగా 6,600 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ వల్ల ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. కాజ్వేల పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. రెండు జిల్లాల్లో కలిపి రూ.600కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. హెక్టారుకు రూ.25వేలు చొప్పున నష్ట పరిహారం అందిస్తామన్నారు.
పోలవరం బాధ్యత కేంద్రం తీసుకున్నా అభ్యంతరం లేదు
ఎర్రకాలువ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తామని సీఎం తెలిపారు. ఆర్అండ్బీ రహదారులకు రూ.35కోట్లు కేటాయిస్తామన్నారు. పోలవరం పనులు 57.5శాతం పూర్తయ్యాయని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పోలవరం కోసం కేంద్రం నుంచి రూ.2,600కోట్లు రావాల్సి ఉందని అన్నారు. కేంద్రం పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 57ప్రాధాన్య ప్రాజెక్టులు చేపట్టామని, ఇందులో 16పూర్తయ్యాయని సీఎం వివరించారు.
నిలిచిన పోలవరం పనులు
కాగా, భారీ వర్షాలు, వరదల కారణంగా పోలవరం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వరద ఉధృతి బాగా పెరిగిపోవడంతో పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో పోలవరం పనులు తాత్కాలికంగా నిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో పోలవరం కడెమ్మ వంతెన పూర్తిగా నీటమునిగింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ కు రవాణా మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ప్రాజెక్ట్ స్పిల్ ఛానల్కు వరద నీరు పొటెత్తడంతో పనులు నిలిచిపోయాయి. వరదల కారణంగా గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అధికారులు వారికి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తున్నారు.