కట్టి తీరుతాం: బాబు, కెసిఆర్ సరేనన్నారు: కావూరి
హైదరాబాద్: పోలవరం నిర్మాణం జరిగితీరుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం లేక్వ్యూ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంపై స్పందించాలని కోరినప్పుడు తొలుత పారిశ్రామిక శ్వేత పత్రంపైనే మాట్లాడుతానని, అంతకుకు మించి ‘డీవియేట్' కానని చంద్రబాబు అన్నారు. ఆయన మీడియా సమావేశంలో చివరిలో పోలవరంపై స్పందించారు. పోలవరం నిర్మించి తీరుతామని అన్నారు.
పోలవరం బిల్లును అడ్డుకోవటం అర్థరహితమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి, అధికార ప్రతినిధులు కింజరపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ అన్నారు. 1959కి ముందు తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలం డివిజన్ను పరిపాలనా సౌలభ్యం రీత్యా ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారన్న విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పిన విషయాన్ని వారు ఢిల్లీలో గుర్తు చేశారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పునరావాస కార్యక్రమాల కోసం ఈ డివిజన్లోని కొంత ప్రాంతాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాషా్ట్రనికి తిరిగి బదిలీ చేస్తున్నామని కూడా మంత్రి చెప్పారన్నారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేసేందుకు అంతా అంగీకరించారని, కాబట్టే అప్పట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందని కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఆరు రాషా్ట్రలకు, దేశానికి ఉపయోగపడుతుందని, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురయ్యే భద్రాచలం డివిజన్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నందున దీనిని తిరిగి ఏపీకే ఇవ్వాలని తాము గతంలో కోరామని, అయితే భద్రాచలం ఆలయం కట్టించిన రామదాసు తెలంగాణ వ్యక్తి కాబట్టి దీన్ని తెలంగాణలోనే ఉంచాలని తెలంగాణవారు కోరారన్నారు.
దీంతో ముంపు గ్రామాలన్నీ ఏపీకి ఇవ్వాలని, ఆలయాన్ని మాత్రం తెలంగాణకు ఇవ్వాలని కాంగ్రెస్ హయాంలోనే నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పోలవరం బిల్లు ఆమోదంపట్ల ఆంధ్రా మేధావుల వేదిక నేత చలసాని శ్రీనివాస్ హర్షం ప్రకటించారు.